కేసీఆర్పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరబోతున్న వంటేరు ప్రతాప్ రెడ్డి... అసలు తాను అధికార పార్టీలోకి ఎందుకు వెళుతున్నాననే అంశంపై టీవీ9తో మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్తోనే ఉన్నారని... అందుకే తాను టీఆర్ఎస్లోకి వెళుతున్నానని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి టీఆర్ఎస్ను గెలిపించాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ను కాకుండా కేసీఆర్ను నమ్మారని అన్నారు.
గజ్వేల్లో తాను ప్రజల పక్షాన పోరాడానని చెప్పిన వంటేరు ప్రతాప్ రెడ్డి... తన పోరాటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు కేసీఆర్ పక్కన ఉన్నప్పుడు తాను కూడా ఆయనతో ఉండటమే కరెక్ట్ అని భావిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆహ్వానం మేరకే తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని అన్నారు. పదవులు, డబ్బుల కోసం తాను టీఆర్ఎస్లో చేరడం లేదని... ఏదో ఒక రోజు గెలవాలనే రాజకీయాల్లో ఉన్నానని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న వారంతా తనతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారని... ఇప్పుడు వారంతా తనతో పాటే టీఆర్ఎస్లో వస్తారని నమ్ముతున్నానని అన్నారు.
మరోవైపు టీఆర్ఎస్లో తన చేరికను వ్యతిరేకిస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు వంటేరు ప్రతాప్ రెడ్డి నిరాకరించారు. టీఆర్ఎస్లో చేరితే కేసీఆరే తనకు బాస్ అని... తాను అందరిని కలుపుకుని పోతానని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Gajwel, Harish Rao, Telangana