గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి టీఆర్ఎస్కు ఆరు శాతం ఓట్లు పెరిగాయని కేటీఆర్ అన్నారు. అయినా గతంతో పోల్చితే రెండు సీట్లు తగ్గాయని వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్గా మాట్లాడిన కేటీఆర్... పలు అంశాలపై స్పందించారు. టీఆర్ఎస్లో అందరూ కష్టపడి పని చేసినా... ఫలితం మాత్రం ఇలా వచ్చిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ గెలిచిన మూడు సీట్లలో రెండు సీట్లు వెంట్రుక వాసి తేడాతో గెలిచిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కాదని వెల్లడించారు.
మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం బీజేపీకి ఓటింగ్ పెరగడానికి కారణమని అన్నారు. బీజేపీకి కార్యకర్తలు లేని చోట కూడా ఆ పార్టీకి ఓట్లు పడ్డాయని తెలిపారు. ఆదిలాబాద్ సీటు గెలుస్తామని బీజేపీ కూడా ఉహించి ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్న కేటీఆర్... అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనేది వాస్తవం కాదని అన్నారు. సిరిసిల్లలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 3 వేల ఓట్లు పడితే ఇపుడు 50 వేలు పడ్డాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పదహారుకు పదహారు సీట్లు గెలిచినా కేంద్రంలో ఏం చేయలేని పరిస్థితే ఉండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు నాలుగు లక్షల ఓట్లు తగ్గాయని అన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా విఫలమయ్యానని అనుకోవడం లేద కేటీఆర్ తెలిపారు. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని... మెజార్టీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలే అక్కడ తమ ఓటమికి కారణమన ప్రచారంలో నిజం లేదని కేటీఆర్ అన్నారు. హరీష్ రావును ఈ ఎన్నికల్లో పక్కన పెట్టామనేది నిజం కాదన్న కేటీఆర్... మెదక్లో టీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచినా సిద్దిపేటలో పార్టీ మెజారిటీ తగ్గిందని గుర్తు చేశారు.
నిజామాబాద్లో కవిత ఓటమికి రైతులు కారణం కాదని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి కాబట్టే నిజామాబాద్లో కవిత ఓడిందని అన్నారు. ఈ ఓటమితో తాము కుంగిపోబోమని తెలిపారు. తెలంగాణ ,ఏపీ ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. మోడీతో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయని కేటీఆర్ తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి అని...తాను కాదని కేటీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Congress, Harish Rao, KTR, MP Kavitha, Revanth reddy, Telangana Lok Sabha Elections 2019