బీజేపీ ఉన్నంత వరకు భారత్ నుంచి కాశ్మీర్ను ఎవ్వరూ వేరుచేయలేరన్నారు అమిత్ షా. కాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని ఉండాలన్న ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్పై కాంగ్రెస్ మిత్రపక్షం అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడ్డం లేదని విరుచుకుపడ్డారు. బాలకోట్పైనా దాడులపైనా విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా..ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో పాటు కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాశ్మీర్కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలని ఒమర్ అబ్దుల్లా అంటున్నారు. ఒక దేశానికి రెండు ప్రధానులు సాధ్యమవుతుందా? కాశ్మీర్కు ప్రధాని ఉండడం సాధ్యమేనా? ఒమర్ అబ్దుల్లా సలహాపై ఆయన ఓట్ల మిత్రుడు రాహుల్ బాబా (రాహుల్ గాంధీ) మౌనంగా ఉన్నారు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. బీజేపీ కార్యకర్త చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దేశం నుంచి కాశ్మీర్ను ఎవ్వరూ వేరుచేయలేరు.
— అమిత్ షా, బీజేపీ చీఫ్
అటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు అమిత్ షా. ఆయనకు ఒడియా భాషపై పట్టులేదని.. పేపర్ లేనిదే ప్రసంగించడం చేతకాదని ఎద్దేవా చేశారు. 19 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నా మాతృభాషలో మాట్లాడడం రాదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు కార్యక్రమాల వల్లే ఒడిశా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారన్న అమిత్ షా...ఈసారి బీజేపీకి అధికారం కట్టబెట్టాలని కోరారు. కేంద్రంలో మరోసారి గెలిచిన తర్వాత కియోంఝర్లో మెడికల్ కాలేజీ, స్టీల్ ప్లాట్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టు దాడిపైనా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దంతెవాడ దాడిలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు కోసమే ఎమ్మెల్యే భీమా మండావిని హత్యచేశారని అమిత్ షా వ్యాఖ్యానించారు. బాంబు దాడులతో తమను బెదిరించలేరని.. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని స్పష్టంచేశారు.
Published by:Shiva Kumar Addula
First published:April 12, 2019, 18:54 IST