బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని రాజ్భవన్లో సాయంత్రం 04.30కి నితీష్ చేత గవర్నర్ ప్రాగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జేడీయూకు సీఎం పదవి వెళ్లడంతో.. బీజేపీకి రెండు డీప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీష్ కుమార్తో పాటు బీజేపీ నేతలు తార్ కిశోర్ ప్రసాద్, రేణు దేవి డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలు, జేడీయూ నేతలు హాజరయ్యారు.
అంతేకాదు జేడీయూ నేతలు విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలాల్ చౌదరి, బీజేపీ నేతలు మంగళ్ పాండే, అమరేంద్ర ప్రతాప్ సింగ్, HAM పార్టీ అధినేత జీతన్రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్, VIP నేత ముకేశ్ సాహ్ని కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక నందకిశోర్ యాదవ్ బీహార్ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించనున్నారు.
వాస్తవానికి ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. జేడీయూ గ్రాఫ్ పడిపోగా.. బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఐనప్పటికీ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. నితీష్ కుమార్నే మరోసారి సీఎంను చేసింది బీజేపీ. ఈ క్రమంలో రెండు దశాబ్దాల్లో ఏడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నేతగా నిలిచారు నితీష్. ఆయన మొదట 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే హంగ్ ప్రభుత్వంలో తగిన బలం లేక కొన్ని రోజులకే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005లో ఎన్డీయే ఫుల్ మెజారిటీ సాధించడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి.. మరోసారి ఆయనే సీఎం పగ్గాలు చేపట్టారు.
ఐతే 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కానీ ఏడాదిలోపే తిరిగి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు నితీష్. 2015 నవంబరులో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన మహా కూటమి నితీష్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో కూటమి విజయంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఐతే ఆర్జేడీతో అధికారం పంచుకోలేక.. 2017లో పదవి నుంచి నితీష్ కుమార్ దిగిపోయారు. ఆ మరుసటి రోజే బీజేపీ మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో.. ఎన్డీయే 125 సీట్లు సాధించింది. మహాకూటమి 110 సీట్లు దక్కించుకుంది. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకే పరిమితయింది. ఇక CPIMLL 11, MIM 5, HAMS 4, VIP 4, CPM 3, CPI 2, LJP ఒక స్థానంలో గెలిచాయి. మ్యాజిక్ మార్క్ 122 కంటే మూడు సీట్లు ఎక్కువ గెలవడంతో.. ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.