NAGARJUNA SAGAR BY POLL TICKET FIGHT IN SAGAR ELECTIONS BIG TEST FOR BJP CHIEF BANDI SANJAY SK
Nagarjuna Sagar: సాగర్ వార్.. బీజేపీలో కొత్త లొల్లి.. బండి సంజయ్కు అసలైన పరీక్ష
బండి సంజయ్
నాగార్జున సాగర్లో పరిస్థితి పూర్తిభిన్నమైనది. అక్కడ బీజేపీలో పేరు మోసిన నేతలెవరూ లేరు. దుబ్బాకలో గెలిచినంత ఈజీగా.. హైదరాబాద్లో కారు ఢీకొట్టినంత అలవోకగా.. సాగర్ ఎన్నికలు ఉండబోవు. అందుకే ఈ ఎన్నిక బండి సంజయ్ నాయకత్వానికి అసలు సిసలు పరీక్ష.
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్ రాకముందే.. అన్ని పార్టీలు వ్యూహ రచనలో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన బీజేపీ.. ఈ ఉపఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దుబ్బాక విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య సీట్లు సాధించడంతో.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. ఐతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సాగర్ ఉపఎన్నికల రూపంలో అసల సిసలు పరీక్ష ఎదుర్కొనబోతున్నారు. ఈ ఎన్నికలు ఆయనకు అతిపెద్ద సవాల్గా మారాయి.
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయానికి రఘునందన్ రావే కారణమని జగమెరిగిన సత్యం. యూత్లో ఆయనకున్న ఫాలోయింగ్.. గుక్కతిప్పుకోకుండా చేసే ప్రసంగాలు.. ప్రజా సమస్యలపై ఉన్న పట్టు.. వీటి వల్లే దుబ్బాకలో కాషాయ జెండా ఎగిరింది. టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. అంతేతప్ప ఆ ఎన్నికల్లో బండి సంజయ్ పాత్ర అంతగా లేదనే అభిప్రాయముంది. కానీ క్రెడిట్ మాత్రం ఆయనకే వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే బీజేపీకి ప్లస్గా మారిందని.. అందుకే 48 డివిజన్లలో విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కానీ నాగార్జున సాగర్లో పరిస్థితి పూర్తిభిన్నమైనది. అక్కడ బీజేపీలో పేరు మోసిన నేతలెవరూ లేరు. దుబ్బాకలో గెలిచినంత ఈజీగా.. హైదరాబాద్లో కారు ఢీకొట్టినంత అలవోకగా.. సాగర్ ఎన్నికలు ఉండబోవు. అందుకే ఈ ఎన్నిక బండి సంజయ్ నాయకత్వానికి అసలు సిసలు పరీక్షగా ఉండబోతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో అప్పుడే టికెట్ల లొల్లి మొదలయింది. ఆ పార్టీ నుంచి నలుగురు నేతలు టికెట్ను ఆశిస్తున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి భార్య కంకణాల నివేదితా రెడ్డి, బీసీ నేత కడారి అంజయ్య యాదవ్, ఇటీవలే పార్టీలో చేరిన ఇంద్రసేనా రెడ్డితో మరో నేత కూడా రేసులో ఉన్నారు. ఎవరికి వారు పాదయాత్రలతో ప్రచారంలో బిజీగా ఉన్నారు. వీరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక బీజేపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత తరుణ్ చుగ్ సర్వే చేయించారని.. అందులో నివేదితా పేరే బయటకు వచ్చిందని తెలుస్తోంది. మరికొందరు నేతలు మాత్రం స్థానికంగా బలమైన నేతగా పేరున్న అంజయ్య యాదవ్ పేరును సూచిస్తున్నారు.
ఐతే తమకు టికెట్ ఇవ్వకుంటే పార్టీకి గుడ్బై చెబుతామని నివేదితా రెడ్డి దంపతులు అనుచరులతో చెప్పారట. స్వార్థపరులకు టికెట్ ఇస్తే.. ఆ మరుక్షణమే పార్టీ నుంచి బయటకొస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రలతో బిజీగా ఉన్న ఆశావహులకు ఫోన్ చేసి.. ఇక చాలు.. ఆపేయమని చెప్పినట్లు తెలుస్తోంది. అభ్యర్థి పేరును ప్రకటించే వరకు ఆగాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యాక.. మిగతా అభ్యర్థులు మద్దతుగా ఉండాలంటే.. వెంటనే ఈ పనులు అపాలని గట్టిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటంచలేదు. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అభ్యర్థిత్వంపై టీఆర్ఎస్ పెద్దలు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక స్థానికంగా ఉంటున్న కోటిరెడ్డికి ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు నోములకు బంధువైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత బాలరాజు యాదవ్ సైతం తన ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, బీజేపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుంది? దుబ్బాక మాదిరే ఇక్కడ కూడా విజయం సాధిస్తుందా? ఈ ఎన్నికల్లో బండి సంజయ్ పాత్ర ఎంత మేర ప్రభావం చూపుతుందన్న దానిపై రాబోయే రోజుల్లోనే క్లారిటీ వస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.