మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళకు చెందిన బీజేపీ మాజీ చీఫ్ రాజశేఖరన్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ నేత శశిథరూర్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే రాజశేఖరన్ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మే నెలలో మిజోరం గవర్నర్గా రాజశేఖరన్ బాధ్యతలు స్వీకరించారు. కేవలం పది నెలలు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ .. రాజశేఖరన్ రాజీనామాను ఆమోదించారు. అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖీ.. మిజోరం గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
2014 ఎన్నికల్లో తిరువనంతపురం ఎంపీ సీటును బీజేపీ కేవలం 15వేల 470సీట్ల తేడాతో కొల్పోయింది. దీంతో ఈసారి అక్కడ బీజేపీ నేత, అయ్యప్ప భక్తుడైన రాజశేఖరన్ను రంగంలోకి దించి ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు కమలనాథులు. రాజశేఖరన్ 1970లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1987లో రాజశేఖరన్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిగా సంఘ్ పరివార్ కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన హిందూ ఐక్యవేదిక, శబరిమల అయ్యప్ప సేవా సమాజం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Lok Sabha Election 2019, Mizoram