news18-telugu
Updated: April 17, 2019, 10:48 PM IST
మోహన్ బాబు, చంద్రబాబు నాయుడు
కర్ణాటకలో మండ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దివంగత కన్నడ స్టార్ అంబరీష్ సతీమణి, నటి సుమలత ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు జేడీఎస్ కష్టపడాల్సి వస్తోంది. జేడీఎస్ తరుపున కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇటీవలే నిఖిల్ తరుపున అక్కడ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబుతో ప్రచారం ద్వారా అక్కడి తెలుగువారిని జేడీఎస్ వైపు ఆకర్షించవచ్చునని కుమారస్వామి భావించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు మండ్య రాజకీయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు అంబరీష్ సతీమణి, నటి సుమలతను భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ నేత, నటుడు మంచు మోహన్బాబు మండ్య ప్రజలను కోరారు. అంబరీష్ ఎక్కడున్నా మండ్య ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసమే నిత్యం పరితపించాడని గుర్తుచేశారు. అంబరీష్ లేని ఈ తరుణంలో.. సుమలతను మన బిడ్డగా ఆదరించి మండ్య నుంచి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.
ఒకప్పుడు అంబరీష్ను చంద్రబాబు తన ద్వారా ఎన్నో కార్యక్రమాలకు పిలిపించారని.. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆయన భార్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు కనీస కృతజ్ఞతాభావం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని.. ఈ ఎన్నికల్లో డబ్బు, కుల రాజకీయాలను పక్కనపెట్టి మండ్య ప్రజలు సుమలతను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Published by:
Srinivas Mittapalli
First published:
April 17, 2019, 10:48 PM IST