మాజీ ప్రధాని దేవెగౌడకు బిగ్ షాక్ తగిలింది. తమకూరు లోక్సభ స్థానంలో ఆయన ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి బసవరాజ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 19,214 ఓట్ల తేడాతో బసవరాజ్ విజయం సాధిచారు. కన్నడ రాజకీయాల్లో హసన్, మాండ్య, తుమకూరు సీట్లపై దేశమంతటా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దేవె గౌడ కుటుంబ సభ్యులు ఆ స్థానాల్లో పోటీచేశారు. హసన్ నుంచి ప్రజ్వల్ (రేవణ్ణ కుమారుడు), మాండ్యా నుంచి నిఖిల్ (కుమారస్వామి కుమారుడు) పోటీచేయగా తుమకూరు నుంచి దేవెగౌడ బరిలో ఉన్నారు. ఐతే హసన్ నుంచి ప్రజ్వల్ విజయం సాధించారు. మాండ్యాలో స్వంతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో నిఖిల్ ఓడిపోయారు.
1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు దేవెగౌడ. అంచెలంచెలుగా ఎదిగి కర్ణాటక సీఎంగా, అనంతరం భారత ప్రధానిగానూ విధులు నిర్వర్తించారు. కర్ణాటకలోని హోళెనరసిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా దేవెగౌడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో 5 సార్లు అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇక 1991నుంచి ఆరుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లోనూ హసన్ నుంచి పోటీ చేసి గెలుపొందిన దేవెగౌడ ఈసారి తుమకూరు నుంచి పోటీచేశారు. హసన్లో తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలోకి దింపారు. అక్కడ ప్రజ్వల్ గెలవగా..తుమకూరులో దేవెగౌడ ఓడిపోయారు. మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి పాలవడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.