నిజామాబాద్ లోక్సభ ఎన్నిక ఈసీకి సవాల్గా మారింది. కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 170 మందికిపైగా పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నారు. ఐతే ఇంత భారీ మొత్తంలో అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో సాధారణ ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం కష్టంగా మారింది. బ్యాలెట్ పద్దతిలో నిర్వహిద్దామనుకున్నా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని ఈసీ భావించింది. ఈ క్రమంలో దేశ చరిత్రలో తొలిసారిగా ఎం3 ఈవీఎంలతో నిజామాబాద్ లోక్సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎం3 ఈవీఎంలు నిజామాబాద్కు తరలించింది ఎన్నికల సంఘం.
దేశంలో కేవలం ఎం2 EVMs ద్వారా గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో M3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో చాలెంజ్తో కూడుకున్నదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ఎం3 ద్వారా పోలింగ్ నిర్వహించబోతున్నామన్నారు. ప్రపంచంలో ఇంత వరకు M3 ఎన్నికలు ఎక్కడా నిర్వహించలేదని చెప్పారు. అంతేకాదు ఒక్క కంట్రోల్ యూనిట్కు 12 బ్యాలెట్ యూనిట్స్ కనెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక చరిత్రకు నాంది పలికిందని అభిప్రాయపడ్డారు.
బుధవారం కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ నిజామాబాద్ పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి ఎం3 ఈవీఎం పనితీరును పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పోలింగ్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుదీప్ జైన్..దేశంలో తొలిసారి ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్కు చేరుకున్న ఎం3 ఈవీఎంలను ఇప్పటికే పరిశీలించారు అధికారులు. సాంకేతిక నిపుణులు, బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికలను నిర్వహిస్తామన్నారు సుదీప్ జైన్. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ప్రతి గ్రామంలోనూ అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MP Kavitha, Nizamabad S29p04, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics, Trs