ఎగ్జిట్ పోల్స్ ఫలితాల జోష్ బీజేపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెజారిటీ సీట్లు వస్తాయని ఫలితాలు వెలువడటం ఆ పార్టీలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డ తెల్లవారే యూపీలో భాగస్వామ్య పక్ష పార్టీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్బర్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను కేబినెట్ తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్ను కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో రాజబర్కు, బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆయన తన మంత్రి పదవికి ఏప్రిల్ 13నే రాజీనామా చేశారు. బీజేపీ ఎన్నికల గుర్తుపై పోటీచేయాలని కమలం పార్టీ తనను కోరిందని, తాను తన సొంత పార్టీ గుర్తుపై బరిలోకి దిగుతానని చెప్పానని, దీనికి బీజేపీ అంగీకరించకపోవడంతో.. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గతంలో వివరణ ఇచ్చారు.
అయితే, యోగి నిర్ణయాన్ని రాజ్బర్ స్వాగతించారు. మొదట సామాజిక న్యాయ కమిటీని ఏర్పాటు చేసి.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఆ రిపోర్ట్లోని మార్గదర్శకాలను అమలుచేసేందుకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నారో అంతేవేగంగా ఆ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.