మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్పులపై పోరాటాన్ని ఉధృతం చేశాయి విపక్షాలు. కౌంటింగ్ రోజు వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల లెక్కింపులో తేడావస్తే నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశాయి. ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లిన 22 పార్టీల నేతలు 8 పేజీల మెమోరాండాన్ని సీఈసీకి అందజేశారు. మెమోరాండంలో పలు అంశాలను కీలకంగా పొందుపరిచారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5వీవీప్యాట్లు లెక్కించాలని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఆదేశించిందని నేతలు గుర్తుచేశారు.
ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశాలు ఉన్నాయని మరోసారి స్పష్టంచేశారు. ఎన్నికల్లో పారదర్శకత ఉండాలంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వెనకడుగు వేయడానికి కారణాలేంటని విపక్ష నేతలు నిలదీసినట్టు సమాచారం. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఐదు వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతోందని నిలదీసినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణలో విఫలమైందని, విపక్షాలు లేవనెత్తిన ఏ ముఖ్యమైన అంశాన్నైనా ఎందుకు పట్టించుకోలేదని తీవ్రంగా ప్రశ్నిస్తూ నేతలు నిరసన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EVM, Evm tampering, Lok Sabha Election 2019, Vvpat