AP Exit Poll Results 2019 : ఆంధ్రా ఆక్టోపస్గా ఆయన అభిమానులు పిలుచుకునే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... అందరూ ఊహించినట్లుగానే తన సర్వేపై ఇదివరకు చెప్పిన మాటల్నే మళ్లీ చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఒకరోజు ముందు... ప్రెస్ మీట్ పెట్టిన ఆయన... ఏపీలో ప్రజలు మరోసారి సైకిల్కి ఓటు వేశారని చెప్పిన విషయం మనందరికీ తెలుసు. ఐతే... తన ప్రెస్మీట్లో లగడపాటి మూడు కీలక కామెంట్లు చేశారు. 1.జనసేనకు సీట్లు వచ్చాయి కానీ... ప్రజారాజ్యానికి వచ్చినన్ని రాలేదన్నారు. అంటే జనసేనకు వచ్చిన సీట్లు 18 కంటే తక్కువ. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం గెలుచుకున్నది 18 అసెంబ్లీ స్థానాలు కాబట్టి. 2.జనసేన ప్రభావం... టీడీపీ, వైసీపీ రెండు పార్టీలపైనా పడిందన్నారు. అంటే, జనసేన వల్ల టీడీపీ, వైసీపీకి ఓట్లు తగ్గినట్లే. 3. ఏపీ ప్రజలు ఒక పార్టీనే స్పష్టమైన మెజార్టీతో గెలిపించారని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ పార్టీ టీడీపీయే. సో లగడపాటి సర్వే ప్రకారం... టీడీపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినట్లు లెక్క. అంటే మేజిక్ ఫిగర్ 88 స్థానాలు వచ్చేసినట్లే.
ఈ లాజిక్ ఎందుకు మిస్సవుతోంది :లగడపాటి సర్వేను కొన్ని కోట్ల మంది ప్రజలు, నేతలు, రాజకీయ విశ్లేషకులు... ఎనలైజ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన దాన్ని విశ్లేషిస్తే... 2014లో 102 స్థానాల్ని గెలుచుకున్న టీడీపీ... ఈసారి జనసేన ప్రభావంతోపాటూ... ప్రజా వ్యతిరేకత వల్ల ఓట్లు తగ్గినా... దాదాపు 90 స్థానాలు దక్కించుకుందని అనుకోవచ్చు. తద్వారా స్పష్టమైన మెజార్టీ ఆ పార్టీకి ఉన్నట్లే అనుకోవచ్చు. అంటే ఇక్కడ జనసేనకు వచ్చినవి 12 స్థానాలు.
ఇదే సమయంలో జనసేన వల్ల వైసీపీకి కూడా తగ్గుతాయన్నారు కాబట్టి... 2014లో వైసీపీకి వచ్చినవి 67 స్థానాలు. ఈసారి జనసేన ప్రభావం వల్ల ఆ పార్టీకి 5 స్థానాలు తగ్గితే... వచ్చేవి 62 సీట్లు. ఇక్కడ జనసేనకి దక్కుతున్నవి 5 స్థానాలు.
మొత్తంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ నుంచీ జనసేన పొందిన స్థానాలు 17 అనుకుంటే... లగడపాటి చెప్పిన ప్రకారం... జనసేనకు అన్ని సీట్లు రాకూడదు. ఎందుకంటే... ప్రజారాజ్యానికి వచ్చినన్ని స్థానాలు జనసేనకు రాలేదని అన్నారు. అంటే జనసేనకు ఓ 10 సీట్లు వచ్చాయనుకుంటే... మిగతా 7 స్థానాలూ ఎటు వెళ్లాయన్నది తేలాల్సి ఉంది.
వాస్తవ విరుద్ధంగా లగడపాటి సర్వే : టీడీపీకి 2014లో ఉన్నంత పాజిటివ్ పరిస్థితులు 2019లో లేవన్నది స్వయంగా ఆ పార్టీ నేతలే వేసుకుంటున్న అంచనా. అదే సమయంలో... వైసీపీ 2014లో కంటే 2019లో చాలావరకూ పుంజుకుందన్నది మరో కోణం. ఆ లెక్కన టీడీపీకి సీట్లు తగ్గి... వైసీపీకి సీట్లు పెరగాలి. లగడపాటి సర్వే ప్రకారం చూస్తే... టీడీపీకి పెద్దగా సీట్లేమీ తగ్గలేదని అర్థమవుతోంది. అలాగే వైసీపీకి సీట్లు పెరగకపోగా... జనసేన వల్ల తగ్గాయని అర్థమవుతోంది. అందుకే ఈ సర్వే ఏమాత్రం వాస్తవాలకు దగ్గరగా లేదంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు మాత్రం దీన్ని ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నా్రు.
ఈసారి సర్వే తప్పు అయితే... ఇక తనను నమ్మాల్నిన పనిలేదంటున్నారు లగడపాటి రాజగోపాల్. ఇది తన విశ్వసనీయతకు పరీక్షగా ఆయన చెబుతున్నారు. కచ్చితంగా తన సర్వే ప్రకారమే ఫలితం ఉంటుందంటున్నారు. సోషల్ మీడియాలో చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా... వాటికి పూర్తి విరుద్ధమైన సర్వేను వివరిస్తూ... లగడపాటి చెప్పిన మాటలు... రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆలోచనలో పడేస్తున్నాయి. ఏ సర్వే నిజం అవుతుందో మే 23న ఎలాగూ తెలుస్తున్నా... ఈలోపు రకరకాల విశ్లేషణలు చేసుకోవడానికి లగడపాటి సర్వే ఛాన్స్ ఇస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.