పుల్వామాలో నెత్తుటేరులు పారించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మరో విధ్వంసానికి కుట్రచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఉత్తర్ ప్రదేశ్ నిఘావర్గాలకు సమాచారం అందింది. ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లో బాంబు దాడులు చేస్తామని జైషే మహ్మద్ ఓ లేఖ విడుదల చేసినట్లు సమాచారం. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేశారని..నేతల రోడ్షోలు, బహిరంగ సభలో పేలుళ్లకు పాల్పడవచ్చని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాది పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎక్కడెక్కడ..ఏరోజున దాడులు చేయబోతున్నారు? ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నారన్న వివరాలను సైతం ఆ లేఖలో ప్రస్తావించారు. యూపీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను టార్గెట్ చేయబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు యూపీ, హర్యానా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేయబోతున్నామని ఉగ్రవాదులు హెచ్చరించారు. మే 13న షామ్లి, బాగ్పట్, మీరట్, గాజ్రోలా, ఘజియాబాద్, ముజఫర్నగర్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. మే 16న అయోధ్యలోని రామజన్మభూమిలో పేలుళ్లు ఆ లేఖలో జరుపుతామని స్పష్టంచేశారు.
జైషే మహమ్మద్ పేరుతో ఉన్న ఈ లేఖపై యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తోంది దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్, రా వంటి సెంట్రల్ ఏజెన్సీలకు సమాచారం ఇచ్చారు. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో యూపీ, ఢిల్లీ, హర్యానాలోని పోలీసులను హైఅలర్ట్ చేశారు. ఈ లేఖపై దర్యాప్తు జరుగుతోందన్న పోలీసులు..ఒకవేళ అది ఆకతాయి పని అయినప్పటికీ తేలిగ్గా తీసుకోబోమని స్పష్టంచేశారు. రాజకీయ నేతలు ప్రచారం చేస్తున్న ప్రాంతాలతో పాటు ప్రార్థనా మందిరాలు, రైల్వే, బస్ స్టేషన్లలో భద్రతను కట్టదిట్టం చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arvind Kejriwal, Lok Sabha Election 2019, Terror attack, Terrorism, Uttar pradesh, Yogi adityanath