వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితి ఏపీలోని పలు రాజకీయ పార్టీలకు ఏర్పడింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన జనసేన గురించే. ఒక ఎన్నికలకు దూరంగా ఉండి.. మరో ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన జనసేన (Janasena).. రాబోయే ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలు సాధించాలని ప్లాన్ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా.. అధికారం ఎవరికి దక్కాలో శాసించే స్థాయిలో అయినా ఉండాలని జనసేన భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలోని(Andhra Pradesh) మెజార్టీ స్థానాల్లో పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుంది. అయితే కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలో మాత్రం ఈ పార్టీలకు జనసేన పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. ఈ విషయం గత ఎన్నికల్లో కూడా రుజువైంది. అలాంటి స్థానాలను గుర్తించే పనిలో ఉన్న జనసేన.. వాటిపై ఇప్పటి నుంచే ఫోకస్ చేయాలని భావిస్తోంది.
గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలు, కృష్ణా, గుంటూరులోని కొన్ని నియోజకవర్గాలపై జనసేన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చాలా సీరియస్గా ఉండాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. అభ్యర్థుల ఎంపికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. కనీసం నలభై నుంచి యాభై స్థానాల్లో ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక సంస్థతో సర్వే చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందు ఈ సర్వే చేస్తే సరైన ఫలితం వస్తుందని ఆయన భావిస్తున్నారని టాక్.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు చిగురించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొంతకాలంగా ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే తాము ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా జనసేనలో అప్పుడే కసరత్తు మొదలైందని కొందరు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం టీడీపీకి చాలా ముఖ్యం. ఇందుకోసం జనసేనతో పొత్తు ఆ పార్టీకి చాలా అవసరమనే వాదన ఉంది. పొత్తుకు అంగీకరిస్తే.. జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ముందుకు రావొచ్చనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది.
Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్
Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?
అయితే చివరి నిమిషంలో సీట్ల ఎంపికను చేయకుండా ముందుగానే కొన్ని సీట్లు ఎంపిక చేసుకుని పొత్తు ఉన్నా.. లేకపోయినా అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలని జనసేన భావిస్తోంది. అలా చేయడం వల్ల పొత్తు ఉన్నా.. లేకపోయినా తాము అనుకున్న సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటే విషయంలో వైసీపీ, టీడీపీతో పాటు జనసేన కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janasena, Pawan kalyan