ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే వారి కన్నీళ్లకు కారణమవుతోందని ఆరోపించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకొన్న దళారులు గురించి విన్నాం... చదివామన్న పవన్.. ఇప్పుడు దళారులను మించిపోయి రైతులను రోడ్డు మీదకు తెచ్చిన ప్రభుత్వాన్ని చూస్తున్నామని మండిపడ్డారు. రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఆ కష్ట జీవులతో కనీళ్లు పెట్టిస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు రూ.3 వేల కోట్లకుపైగా వరి పండిందన్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి నిరుద్యోగులను ఎలా మోసపుచ్చారో... అదే విధంగా రైతన్నలను కూడా నమ్మించి మోసం చేశారని పవన్ విమర్శించారు.
ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు డబ్బు జమ చేస్తామని చెప్పారని.., అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి నేటి వరకూ వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో విఫలమవుతూనే ఉందని పవన్ అన్నారు. నెలలు గడుస్తున్నా రైతుకు మాత్రం డబ్బు అందటం లేదని.., రబీ సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్లు వరకూ రైతులకు బకాయిలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను, లెక్కలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.
కొనుగోలు, బకాయిల విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తమ కష్టార్జితం కోసం అడిగిన రైతులను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు దూషించి, బెదిరించడం దుర్మార్గమని ఆయన అన్నారు. నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించని పక్షంలో రైతులకు జనసేన పార్టీ అండగా నిలిచి పోరాడుతుందన్న పవన్.. గతంలో రైతుల కోసం కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసిందని చెప్పారు.
రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్లో పంటకు పెట్టుబడి ఉంటుందని.. రబీ డబ్బులు రాక, రుణాలు అందకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్.., అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొన్నారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందించడంలోనూ పార్టీ లెక్కలే చూస్తున్నారని.., పండించే పంటకీ, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమే ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Farmers, Janasena party, Pawan kalyan