JANA SENA CHIEF PAWAN KALYAN PRAISES PM MODI OVER PADMA AWARDS 2022 TO KINNERA MOGILAIAH AND OTHERS MKS
Pawan Kalyan: అలాంటి వారినే PM Modi గుర్తిస్తారు.. కిన్నెర మొగిలయ్యకు Padma Awards 2022 జనసేనాని స్పందన
కిన్నెర మొగిలయ్యకు పవన్ సత్కారం(పాత ఫొటో)
కిన్నెర మొగిలయ్య దుస్థితిపై మీడియాలో కథనాల తర్వాత ఆయన గురించి విన్న పవర్స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. ఆ తర్వాత కళాకారుడి దశే మారిపోయింది. మొగిలయ్యకు పద్మ పురస్కారంపై జనసేనాని స్పందించారు..
తెలంగాణకు చెందిన అరుదైన కళను బతికిస్తూన్న దర్శనం మొగిలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారంతో సత్కరించింది. 12 మెట్ల కిన్నెర వాయించే మొగిలయ్య గురించి తెలంగాణ పాఠ్యాంశాల్లోనూ ఉంది. అయితే, పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో పాడటానికి ముందు వరకూ ఆ కళాకారుడు దుస్థితిని ఎదుర్కొన్నమాట వాస్తవం. కళాకారుల పింఛను దక్కక, ఆసరా పింఛనుకు వయసు చాలక, పిల్లలు కూలీలుగా జీవిస్తోన్న క్రమంలో మూర్ఛవ్యాధితో బాధపడే చిన్నకొడుకు వైద్యానికి నెలకు రూ.4 వేల వరకూ ఖర్చులు కూడా వెళ్లదీయలేక మొగిలయ్య చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే,
మొగిలయ్య దుస్థితిపై మీడియాలో వరుస కథనాల తర్వాత పలువురు ఆర్థిక సహాయం చేసినా, కళాకారుడిగా ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం ‘భీమ్లా నాయక్’ సినిమానే. మొగిలయ్య గురించి విన్న పవర్స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. కొన్నేళ్ల కిందట విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్గా మారిపోయారీ కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి.
కిన్నెర మొగిలయ్యకు కేంద్రం పురస్కారంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను పీకే అభినందించారు. పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు..
‘బయోటెక్ సంస్థ కృషికిగాను ఆ సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం ముదావహం. సాఫ్ట్ వేర్ రంగంలో తెలుగువారి ఖ్యాతి చాటిన మైక్రోసాఫ్ట్ సి.ఈ.ఓ. సత్య నాదెళ్ళతోపాటు గూగుల్ సీఈవో, మన దక్షిణ భారతీయుడు శ్రీ సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేయడం సముచితం. దేశ రక్షణ కోసం విశిష్ట సేవలందించి ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించి ఆయన సేవలకు సార్థకత కలిగించారు.
తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మిక అంశాలపై సాధికారత కలిగిన ప్రవచనకర్త, అవధాని గరికపాటి నరసింహారావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్ లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డా.సుంకర ఆదినారాయణరావు, అరుదైన కిన్నెర వాయిద్యంపై సంగీతం పలికించే దర్శనం మొగులయ్య, ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి పద్మజా రెడ్డి, కళాకారులు రామచంద్రయ్య, ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గార్లను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ గారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా ప్రచారానికి దూరంగా కళా సేవ చేసేవారిని, సంఘ సేవకులను నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తిస్తుంది అని మరోసారి వెల్లడైంది’ అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.