IT IS BJP VICTORY THAT CM KCR TAKES BACK NREGS FIELD ASSISTANT SERP AND MEPMA EMPLOYEES INTO DUTIES SAYS BANDI SANJAY MKS
Telangana: బీజేపీ ఖాతాలో మరో విజయం.. CM KCR మెడలు వంచాం కాబట్టే శుభవార్త: బండి
బండి సంజయ్, కేసీఆర్
ఉపాధి హామీ పథకం ఫీల్ట్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఇది బీజేపీ సాధించిన విజయమని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల క్రమంలో సీఎం కేసీఆర్ వరుసగా సంచలన నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. గత వారం ఏకంగా 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన ఆయన.. సుదీర్గ కాలంగా ఆందోళనలు చేస్తోన్న ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. అయితే ఈ ఘనత తమదేనని బీజేపీ క్లెయిమ్ చేసుకుంది. కేసీఆర్ మెడలు వంచేలా తాము చేసిన పోరాటాల ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడిందని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంతకు మందు, ఉద్యోగాల భర్తీ ప్రకటన కూడా బీజేపీ విజయమేనని బండి చెప్పుకోవడం తెలిసిందే.
శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు కేసీఆర్ మంగళవారం నాడు సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ సదరు సిబ్బందికి శుభవార్త వెలువరించారు. సమ్మె కారణంగా తొలగింపునకు గురైన (సుమారు 7,714 మంది) ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని, సెర్ప్ లో పనిచేస్తోన్న 4,500 మంది సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
‘వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం..’అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన వెలువడిన కాసేపటికే..
ఉపాధి హామీ పథకం ఫీల్ట్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఇది బీజేపీ సాధించిన విజయమని బండి సంజయ్ అన్నారు. ‘ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గత కొన్నాళ్లుగా పోరాడుతున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా అనేక వేదికలపైనా వివిధ రూపాల్లో ఉద్యమించాం. ప్రజా సంగ్రామ యాత్రలోనూ ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున గళమెత్తినం. వారి సమస్యలను, ఉద్యోగాలు కోల్పోయి పడుతున్న బాధలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాం. వారిని విధుల్లోకి తీసుకోవాలని గతంలో ముఖ్యమంత్రికి లేఖలు కూడా రాశాం’అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక,
కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేస్తామంటోన్న బీజేపీ బండి సంజయ్ మరికొన్ని అంశాలను ప్రభుత్వం ముందుంచారు. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల మాదిరిగానే 12 వేల మంది విద్యా వలంటీర్లను, 22 వేల మంది స్కూల్ స్కావెంజర్లను, 1700 మంది స్టాఫ్ నర్సులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని సైతం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.