కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్పై భారత్ చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాలకు ముడిపెడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాల నుంచి ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి పాకిస్తాన్ కూడా యడ్యూరప్ప కామెంట్స్ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది.
ఇంతకీ యడ్యూరప్ప ఏమన్నారంటే.. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన దాడులతో దేశంలో మరోసారి మోదీ ప్రభంజనం ఖాయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు దేశంలో బీజేపీ ప్రభ పెరుగుతోందని.. ఈ దెబ్బతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 28 స్థానాలకు గాను 22 స్థానాలు గెలవడం ఖాయమని అన్నారు. బుధవారం చిత్రదర్గలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
యడ్యూరప్ప వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లోనే కాదు.. పాకిస్తాన్లోనూ హాట్ టాపిక్గా మారాయి. పాకిస్తాన్ అధికార పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందించింది. యుద్దాన్ని బూచిగా చూపి రాజకీయ లబ్ది పొందాలనే చర్యలను మానుకోవాలని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా సూచించింది.
కాగా, పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 300మంది ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం పాక్ ప్రతీకార దాడులకు దిగగా..భారత వైమానిక దళం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే భారత్కు చెందిన మిగ్-21 విమానం ఒకటి మిస్ అవడంతో పాటు.. వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ను పాకిస్తాన్కు పట్టుబడ్డారు. దీంతో అభినందన్ను సురక్షితంగా భారత్ తీసుకొచ్చే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India VS Pakistan, Jammu and Kashmir, Karnataka, Kashmir security, Narendra modi, Pulwama Terror Attack, Yeddyurappa