హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలను పోటెత్తిన ఓటర్లు భారీగా పోలింగ్ నమోదు చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 82.3 శాతం నమోదైనట్లు తెలుస్తోంది. డిసెంబరు ఎన్నికల్లో 85.96 శాతం నమోదయింది. క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. క్యూలైన్లలో ఉన్న వారంతా ఓటు వేసిన తర్వాత.. పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశముంది. ఉపఎన్నికల్లోనూ ఇంత భారీగా పోలింగ్ నమోదవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. హుజూర్ నగర్లో నమోదైన పోలింగ్ శాతాన్ని మరికాసేపట్లో ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.
హుజూర్నగర్ స్థానంలో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరుసాగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పోలింగ్ జరుగుతున్న తీరును బట్టీ... ప్రజలు ఎవరికి అనుకూలంగా ఓటు వేసింది ఇప్పుడే చెప్పేలమంటున్నారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానాలోనూ పోలింగ్ ముుగిసింది. మహారాష్ట్రలో అక్కడక్కడా వాన కురుస్తున్నా... పోలింగ్కి ఎలాంటి ఆటంకమూ కలగలేదని అధికారులు తెలిపారు. కాగా, హుజూర్ నగర్తో పాటు మహారాష్ట్ర, హర్యాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబరు 24న వెలువడుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.