అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒంగోలు జాతి గిత్తల పుట్టినిల్లు.. ఉద్దండులైన రివల్యూషనరీ లెఫ్టిస్ట్ మాదాల నారాయణ స్వామి, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన బెజవాడ పాపిరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి నేతలు కూడా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శిద్ధా రాఘవరావు సామాజికంగా, ఆర్థికంగా బలమైన వ్యక్తులు కావడం... వైఎస్ జగన్ గెలిస్తే జిల్లా అభివృద్ది చెందుతుంది అని వైసీపీ చేస్తున్న ప్రచారంతో ఏపీ రాజకీయాల దృష్టి ఈ స్థానంపై ఉంది.

( Image: Wikipedia )
ఒంగోలు ఎంపీగా టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ తరఫున మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బరిలో ఉంటారని అంతా భావించారు. ఏపీలో నెలకొన్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు. చెన్నై, నెల్లూరులోని మాగుంట కుటుంబానికి చెందిన వ్యాపారసంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరగడంతో పరిస్థితి మారిపోయింది. దీనికి తోడు టీడీపీ తరఫున పోటీచేస్తే విజయం సాధించడం కష్టమనే సొంత సర్వే రిపోర్టులతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చివరి నిమిషంలో టీడీపీ మంత్రి శిద్ధా రాఘవరావును ఎంపీగా బరిలో నిలిపింది. మొదట వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా కనిపించిన... వైఎస్ జగన్ బాబాయి, మాజీ ఒంగోలు ఎంపీ టికెట్ తనకు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో విదేశాలకు వెల్లిపోవడం. వచ్చిన తర్వాత కూడా ప్రకాశం జిల్లాలో తాను ఎన్నికలు జరిగే వరకూ అడుగుపెట్టనని ప్రకటించడంతో మాగుంట గెలుపుపై అనుమానాలు ముసురుకుంటూ.. టీడీపీ నేతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

టీడీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి శిద్ధా రాఘవరావు (Image : Facebook)
రెడ్డి సామాజికవర్గం నేత కావడం. మాగుంట కుటుంబం చేసిన సేవాకార్యక్రమాలు. వివాదరహితుడు కావడం. అన్ని పార్టీల్లోని నాయకులతో స్నేహసంబంధాలు ఉండటం మాగుంట శ్రీనివాసులురెడ్డికి ప్రధానమైన బలం. ఏపీలోని జిల్లాల్లో అధిక శాతం ఎస్సీ సామాజికవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. ఆ వర్గం వైసీపీకి బలమైన మద్దతు దారు కావడం కూడా మాగుంటకు అనుకూల అశం. ఇప్పటి వరకూ ఒంగోలు ఎంపీ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరిగితే.. పార్టీ ఏదైనా కానీ, 10 సార్లు రెడ్డి సామాజికవర్గం వారే ఇక్కడ నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రెడ్డి సామాజికవర్గం కావడంతో ఇది ఆయనకు ప్రధాన బలం. కానీ, కనిగిరి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలలో బలమైన అనుచరగణం ఉన్న మాజీ ఎంపీ వైవీ, సుబ్బారెడ్డి ఎన్నికలు దూరంగా ఉండటంతో.. ఆయన వర్గం మాగుంటకు సహకరించడం అనుమానమే. ఐటీ, ఈడీ రైడ్స్ కి భయపడి వైసీపీలో చేరారని జిల్లాలో బలమైన ప్రచారం ఉండటం, మాగుంట నామినేషన్ వేయగానే ట్విట్టర్లో రుణఎగవేత దారుడు విజయ్ మాల్యా ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేయడం విద్యావంతుల్లో మైనస్ అయింది. గిద్దలూరులో మాజీ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీకి మద్దతుగా నిలవడం, కొండపి నియోజకవర్గంలో ఇంఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబును వైసీపీ అధిష్టానం తప్పించడం, దర్శిలో పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ కాపు సామాజికవర్గం వారు కావడం, అక్కడ వైసీపీలో ఉన్న బలమైన బూచెపల్లి కుటుంబానికి స్థానికి వైసీపీ అభ్యర్థికి గతంలో రాజకీయ విభేదాలు ఉండటం మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మైనస్.

వైసీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Image : Facebook)
పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, చివరి విడత రైతు రుణమాఫీ నిధులు విడుదలైతే లబ్ది దారులు అంతా టీడీపీకి మద్దతుగా ఉంటారని టీడీపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు బలంగా నమ్ముతున్నారు. టీడీపీ తరఫున బరిలో ఉన్న రెడ్డి, కమ్మ, కాపు సామాజికవర్గం అభ్యర్థులు బలమైన వారు కావడంతో వారు.. ఎంపీకి కూడా ఓట్లు పోలయ్యేలా చూస్తారనే నమ్మకంతో శిద్ధా ఉన్నారు. ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో వైశ్య సామాజికవర్గం ఓట్లు సుమారు లక్షా ఇరవై వేలు ఉండటం.. టీడీపీ అభ్యర్థి శిధ్దా రాఘవరావు వైశ్య సామాజికవర్గం కావడం ఆయన బలం. మంత్రిగా పనిచేయడంతో.. జిల్లాలోని అందరూ శాసన సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలసివచ్చే అంశం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేస్తుండటంతో రెడ్డి సామాజికవర్గం ఓట్లు టీడీపీకి పోలయ్యే అవకాశం ఉంది. వైశ్య సామాజిక వర్గం వారికే మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చారు అనే వాదన.. పార్టీ బలవంతంపై అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు అనే ప్రచారం ఆయనకు మైనస్ గా మారింది.మరోవైపు.. చివరి నిమిషంలో ఇరుపార్టీల అభ్యర్థులు డిక్లేర్ కావడం. రెండు పార్టీల్లోనూ కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో.. పాతవారు అసంతృప్తిలో ఉండటం టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు మైనస్. కమ్మ సామాజికవర్గం ఎలాగైనా సరే టీడీపీ ఓడిపోకూడదని ఐకమత్యంగా కృషి చేస్తుండటం, అదే స్థాయిలో రెడ్డి సామాజికవర్గం కూడా వైసీపీ కోసం పనిచేస్తుండటం ఆసక్తికర అశం.
కనిగిరి, దర్శి, గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గం, మార్కాపురం టౌన్ లోనూ కాపు సామాజికవర్గం బలంగా ఉంది. జనసేన తరఫున బెల్లంకొండ సాయిబాబా అనే కొత్తవ్యక్తి బరిలో ఉన్నారు. ఆయన ఎవరో కూడా ప్రజలకు తెలియదు. దీంతో కాపుల ఓట్లు ఎటు మల్లుతాయి అనేది ప్రశ్నార్థకమే.
కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురంలో కరవు కారణంగా సుమారు 90 వేలమంది వలస కూలీలు పనులకోసం పక్కరాష్ట్రాలకు వెళ్లారు. వీరు సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. కానీ, ఇరు పార్టీలు మధ్యవర్తల ద్వారా వారి ఓట్ల కొనుగోలుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. మరి వీరు ఏ పార్టీ వైపు నిలుస్తారు అనేది కూడా కీలకం.
మరోవైపు.. కాంగ్రెస్, జనసేన పార్టీలు అంతర్గతంగా టీడీపీకి సహకరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. దీనిని బలపరిచేటట్లు గిద్దలూరు నియోజకవర్గంలో కాపు, రెడ్డి సామాజికవర్గాలదే ప్రాబల్యం. దీంతో టీడీపీ రెడ్డి సామాజికవర్గానికి, వైసీపీ కాపు సామాజికవర్గానికి టికెట్ ఇస్తే.. జనసేన కూడా చంద్రశేఖర్ యాదవ్ అనే యాదవ సామాజికవర్గం వ్యక్తిని బరిలో నిలిపింది. దీంతో బీసీ ఓట్లలో కచ్చితంగా చీలిక వస్తుంది. ఇది వైసీపీకి మైనస్ గా మారవచ్చు.
కనిగిరి నియోజకవర్గంలో కూడా కాపు, బీసీ, రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇక్కడ వైసీపీ యాదవ సామాజికవర్గానికి, టీడీపీ రెడ్డి సామాజికవర్గానికి టికెట్సు ఇచ్చాయి. ఇక్కడ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు సామాజికవర్గం వ్యక్తి దీంతో కాపు, రెడ్డి సామాజికవర్గం ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన కాపు, బీసీ అభ్యర్థులను బరిలో నిలపవచ్చు.. కానీ, ఈ స్థానం సీపీఐకి కేటాయించింది. ఇది టీడీపీకి అనుకూలించే అశం.
ఒంగోలులో కూడా కాపు సామాజికవర్గం 26 వేల వరకూ ఉన్నా.. జనసేన కాపు సామాజికవర్గం వారిని కాకుండా.. ముస్లిం సామాజికవర్గం అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్న ముస్లీం ఓట్లలో చీలిక ఏర్పడి... వైసీపీకి నష్టం కలగవచ్చు. ఈ పరిణామాలను గమనిస్తే ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో జనసేన టీడీపీకి మేలు చేసే విధానం అవలంభించింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
(డి.లక్ష్మీనారాయణ, న్యూస్ 18 ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ )