ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మహారాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. మహారాష్ట్రలో పరిస్థితి చూస్తుంటే.. గవర్నర్ ఏ పార్టీకి చెందినవాడైతే ఆ పార్టీదే అధికారం అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కాకుండా ఇతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని తాను భావించానని.. కానీ ఇప్పుడు తన అభిప్రాయం మారిందని అన్నారు. గవర్నర్ ఏ పార్టీ వాడైతే..ఆ పార్టీ వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు.
కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో శుక్రవారం రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయాయి. ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ బీజేపీకి మద్దతునివ్వడంతో శనివారం తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.తెల్లవారితే సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం లాంఛనమే అనుకున్న శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకి ఇది ఊహించని పరిణామం.ఈ మొత్తం వ్యవహారంలో శరద్ పవార్ డబుల్ గేమ్ ఆడారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం శరద్ పవార్పై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేసింది. అటు అజిత్ పవార్తో వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఎన్సీపీ గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Published by:Srinivas Mittapalli
First published:November 23, 2019, 22:16 IST