తెలుగు రాష్ట్రాలతో పాటు... హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ ప్రస్థానం ముగిసింది. తెలంగాణకు కొత్త గవర్నర్గా తమిళనాడకు చెందిన బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ను నియమిస్తూ.. కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ గవర్నర్ నరసింహన్ దంపతులకు ఘనంగా వీడ్కోలు పలికింది తెలంగాణ ప్రభుత్వం. ప్రగతి భవన్లో గవర్నర్ నరసింహన్ దంపతులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్.ఈ కార్యక్రమానికి సీఎం, ఉన్నతాధికారులతో పాటు... మంత్రులు హాజరయ్యారు.
ప్రగతి భవన్లో ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్ దంపతులు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సతీమణి విమల నరసింహన్ ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. ఎయిర్ పోర్టుకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఉద్యోగులు, రాజ్భవన్ సిబ్బందికి వెళ్లొస్తానని చెబుతూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. చిన్నవారిని దీవిస్తూ.. ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైట్ ఎక్కుతూ కూడా గవర్నర్ దంపతులు అందరికీ నమస్కారాలు చేస్తూ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అక్కడున్న చాలామంది ఉద్యోగులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు.. గవర్నర్తో కలిసి పనిచేసిన అధికారులు అంతా ఉద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక విమానంలో బయల్దేరారు.
Published by:Sulthana Begum Shaik
First published:September 07, 2019, 16:40 IST