కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మాట్లాడిన గవర్నర్ కేవలం మర్యాద పూర్వకంగానే హోంమంత్రిని కలిశానన్నారు. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షాకు వివరించానన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు గవర్నర్. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే తొలివిడతగా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవనాలను... తెలంగాణకు ఇవ్వడానికి ఏపీ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవనం అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు అమిత్ షాతో గవర్నర్ భేటీ అయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండో దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రానికి మాజీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ లేదా పాండిచ్చేరి గవర్నర్ కిరణ్బేడీలలో ఎవరినో ఒకరిని గవర్నర్గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే తరహాలో ఏపీలో కూడా గవర్నర్ మార్పు ఖాయమన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా గవర్నర్ నరసింహాన్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
Published by:Sulthana Begum Shaik
First published:June 10, 2019, 14:44 IST