ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు హైదరాబాద్ బల్దియా అధికారులు షాకిచ్చారు. ఆయన ఇంట్లోని అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని 149 ప్లాటు నంబర్లో డీజీపీ ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను తొలగించారు. హౌసింగ్ సొసైటీకి చెందిన ఖాళీ జాగాను ఆక్రమించి డీజీపీ ప్రహరీ గోడ నిర్మించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్గౌడ్తో కూడిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే జీహెచ్ఎంసీ ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా వారంపాటు స్టేటస్కో విధించింది
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత పది రోజులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసముండే ప్రశాసన్ నగర్లోని 149 ప్లాటుకు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ యజమాని. అక్కడ జీ+1కు అనుమతి తీసుకుని మూడు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. అనంతరం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. దక్షిణ, తూర్పు భాగాల్లోని సెట్బ్యాంక్ స్థలంలో మెట్ల నిర్మాణం చేపట్టారు. వీటివల్ల పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారులు గర్తించారు. ఈ విషయమై 2017 జూన్ 4న జీహెచ్ఎంసీకి ప్రశాసన్నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది.
గత ఏడాది జీహెచ్ఎంసీ అధికారులు సెక్షన్ 452(1) కింద ఇంటి యజమానికి నోటీసులు జారీచేయగా.. ఆయన సిటీ సివిల్ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇటీవల కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ను రద్దుచేయడంతో జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 636(1) కింద అధికారులు తుది నోటీసులు జారీచేశారు. పార్కులో చేపట్టిన ప్రహారి గోడ, ఇతర నిర్మాణాలను స్వల్పంగా కూల్చివేశారు. అయితే కౌంటర్ దాఖలుకు రెండువారాల గడువు ఇవ్వాలని డీజీపీ తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఈ నెల 11 నాటికి దాఖలు చేయాలని స్పష్టంచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, GHMC, High Court