గ్రేటర్ విశాఖ మేయర్ గా మహిళ బాధ్యతలు స్వీకరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన గొలగాని వెంకట హరి కుమారి విశాఖ మేయర్ గా భాద్యతలు స్వీకరించారు. చివరి నిమిషం వరకు మేయర్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ కొనసాగింది. ప్రమాణ స్వీకారానికి కొన్ని నిమిషాల ముందే ఎంపీ విజయసాయిరెడ్డి గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ గా ప్రకటించారు. కాసేపటికే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. విశాఖ మహిళా మేయర్ గా గతంలో రాజాన రమణి చేశారు. రెండో మహిళ మేయర్ గా హరి కుమారి నిలిచారు. అయితే ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించడంతో.. పరిపాలన రాజధానిలో తొలి మేయర్ పీఠం మహిళ కైవసం చేసుకునట్టు అయ్యింది.
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ను ప్రత్యేకంగా చూస్తోంది. అందుకే మేయర్ ఎంపికపై ఆచి తూచి అడుగులు వేసింది. ముందు నుంచి నగర ఇంచార్జ్ వంశీ కృష్ణ యాదవ్కు మేయర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా తనకే సీటు వస్తుందని భావించి.. కార్పొరేటర్ గా గెలిచిన తరువాత సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే బుధవారం సాయంత్రం నుంచి మహిళకు మేయర్ పదవి ఇస్తున్నారని తెలియడంతో వంశీ కృష్ణ యాదవ్ అనుచరులు ఆందోళన బాట పట్టారు. వంశీకే మేయర్ పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు. కానీ ఆ ఆందోళనలు పట్టించుకోని అధిష్టానం మహిళకే ఓటు వేసింది.
కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి 4,850 ఓట్ల అత్యధిక మెజార్టీతో గొలగాని హరి వెంకట కుమారి గెలుపొందారు. ఈ విజయం కూడా ఆమె ను మేయర్ పదవి లభించేలా చేసింది. ప్రస్తుతం ఆమె బీఎస్సీ బీఈడీ పూర్తి చేసి టీచర్ గా సేవలందిస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయ సేకరణలోనూ అధికంగా గొలగాని హరివెంకట కుమారి పేరునే సూచించినట్టు సమాచారం.
అయితే ఆమె ఎంపిక వెనుక అధిష్టానం చాలా వ్యూహాలే రచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రకటించిన ప్రభుత్వం.. మేయర్ పదవిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని.. నగరంలో పార్టీ మరింత బలపాడాలి అంటే ఎలాంటి సామాజిక సమీకరణాలు పని చేస్తాయి అంటూ..అన్నీ లెక్కలు వేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా తూర్పు నియోజకర్గానికి చెందిన మహిళకు పదవి ఇవ్వడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే వెలగపూడి.. వైసీపీ పెద్దలకు ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే దక్షిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇప్పటికే జగన్ కు జై కొట్టారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా అసలు పార్టీలో ఉన్నారా? లేదా అన్నది ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న.. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సైతం అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రస్తుతం టీడీపీ తరపున పోరాడుతున్నది వెలగపూడి మాత్రమే.. అతడికి కేడర్ నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో తూర్పు నుంచి మేయర్ అభ్యర్థి ఉంటే ఎమ్మెల్యే వెలగపూడికి చెక్ చెప్పవచ్చని విశాఖ స్థానిక వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన యాదవ సామాజిక మహిళకు మేయర్ పదవిని కట్టబెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, Municipal Elections, Visakha, Visakhapatnam, Vizag