సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుపై సంచలన ఆరోపణలు చేశారు. 2017లో మంజీర నీటిని మంత్రిగా ఉన్న హరీశ్ రావు అక్రమంగా తరలించారని ఆరోపించారు. ఆయన చేసిన పాపానికి ప్రస్తుతం మంజీర ఎండిపోయిందని వ్యాఖ్యానించారు. తాగునీటి కోసం ఉన్న మంజీర నీటిని హరీశ్ రావు ఎందుకు తరలించారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. డెడ్ స్టోరేజీ వాటర్ కూడా లేకుండా మంజీరా నీటిని తరలించింది నిజం కాదా ? అని మండిపడ్డారు. భారీ నీటిపారుదల శాఖమంత్రిగా ఉన్న హరీశ్ రావు సీఎం కేసీఆర్కు తెలియకుండానే ఇలా చేసి ఉంటారని ఆరోపించారు.
ఈ విషయం కేసీఆర్కు తెలిస్తే... ఇందుకు అనుమతి ఇచ్చేవారు కాదని అన్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన హరీశ్ రావు నియంతృత్వంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మంజీరా నీళ్లు ఉమ్మడి మెదక్ ప్రజల నీళ్లు అని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి... దీనిపై హరీశ్ రావు, ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తక్షణమే కేసీఆర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లివ్వాలన్న కేసీఆర్ కోరికకు హరీశ్ రావు తూట్లు పొడిచారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
హరీశ్ రావుపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను గెలిస్తే... ఈ విషయాలపై ప్రశ్నిస్తాననే కారణంతోనే తనను హరీశ్ రావు జైల్లో పెట్టించారని ఆరోపించారు. తక్షణ అవసరం మేరకు సంగారెడ్డికి నీటి కోసం రూ.10కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొద్దిరోజుల క్రితం హరీశ్ రావు కంటే కేటీఆర్ ఎంతో బెటర్ అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి... మరోసారి హరీశ్ రావు టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Harish Rao, Jagga Reddy, KTR, Telangana, Trs