AP Assembly: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సభలో అడుపెట్టనంటూ స్పష్టం చేశారు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తన ఇంట్లోని వాళ్లపైనా అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ విషయంపై.. తన ఛాంబర్లో అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశాన్ని సైతం నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం తన నిర్ణయాన్ని సభలో వెల్లడించారు. ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని (minster kodali nani), కురసాల కన్నబాబు (kurasala kannababu), అంబటి రాంబాబు (ambati rambabu) లాంటి నేతలు నేరుగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలపై చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. తనను.. నత కుటుంబాన్ని ఘోరంగా అవమానించారని.. కుప్పంలో ఓటమి తరువాత సీఎం జగన్ (CM Jagan).. తన మొఖం చూడాలి అన్నారని.. దానికి కూడా తాను బాధ పడలేదన్నారు. ఆఖరికి తన కుటుంబాన్ని కూడా వదలడం లేదన్నారు. తన భార్య పేరు ప్రస్తావించి విమర్శలు చేయడం ఆవేదన కలిగించింది అన్నారు. అందుకే మళ్లీ సీఎం అయ్యకే సభకు వస్తాను అంటూ సభలోనే చంద్రబాబు శపథం చేశారు. సభలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh assembly) సమావేశాలు రెండో రోజు రచ్చ రచ్చగా మారాయి. మొదటి రోజు అంతా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఇక రెండో రోజు అదే హీట్ కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా టీడీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
చంద్రబాబు ఏమన్నారంటే..?
వైసీపీ మంత్రులు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆయనేం అన్నారంటే.. ‘ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు పడ్డాను. నా భార్య, నా కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అవమానించేలా మాట్లాడారు. నా కుటుంబ సభ్యులను కూడా రోడ్డుపైకి లాగారు. ఎప్పుడూ లేని అవమానాలు భరించాను. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని తీవ్ర భావోద్వేగంతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో సభ నుంచి మాజీ ముఖ్యమంత్రి వెళ్లిపోయారు. ఆయన వెంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికొచ్చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అవహేళనగా నవ్వుతూ కనిపించారు.
టీడీపీఎల్పీ సమావేశంలోనూ ఆయన ఆవేదనకు గురయ్యారు. ఓ దశలో.. చంద్రబాబు కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం. పార్టీ నేతలు ఆయనను సముదాయించారని.. సమాచారం. చివరికి సభకు వచ్చిన చంద్రబాబు.. మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించి.. సభ్యులందరికీ నమస్కరిస్తూ బయటికి వెళ్లిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP News, Chandrababu Naidu