ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఓ సలహా ఇచ్చారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తూ సమయం వృధా చేసుకోవద్దని ఆమెకు సూచించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్-బీజేపీలు ముఖాముఖీ తలపడుతుండడంతో అక్కడ ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహిస్తే మంచిదని కేజ్రీవాల్ హితవు పలికారు. ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రియాంక గాంధీ బుధవారం నుంచి రోడ్షోలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలో ఎస్పీ-బీఎస్పీకి వ్యతిరేకంగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ...రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. ఆ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు పరస్పరం తలపడుతున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని పరోక్షంగా ఆరోపిస్తూ కేజ్రీవాల్ ఈ విమర్శలు చేశారు.
ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఆదివారం ఆరో విడతలో పోలింగ్ జరగనుండగా...మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arvind Kejriwal, Delhi Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Priyanka Gandhi