మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంట్ స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది. ఉద్ధండులుగా పేరొందిన నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటే అయినప్పటికీ మెదక్ పార్లమెంట్ స్థానానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ స్థానానికి 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి గెలిచినప్పటికీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. బాగారెడ్డి, మల్లిఖార్జున్ వంటి సీనియర్ నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
ఇందిరను ఆదరించిన మెదక్
1980లో అధికారం కోల్పోయి రాజకీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని.. మెదక్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. రాజకీయంగా ఆమెను నిలబెట్టి.. ప్రధాని పదవిని అధిరోహించేలా చేశారు. అందుకే ఆమె, మెదక్ ప్రజలపై ప్రత్యేక అభిమానాన్ని చూపారు. తన గుర్తింపు ఉండాలన్న ఆకాంక్షతో మెదక్ జిల్లాలోనే ఓడీఎఫ్ (భారత ఆయుధ కర్మాగార సంస్థ), బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) వంటి అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల కారణంగానే ఇప్పటికీ మెదక్ ప్రజలు ఇందిర పేరును స్మరిస్తుంటారు. మొత్తం 16సార్లు మెదక్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
సిద్దిపేట నుంచి నియోజకవర్గాల బదిలీ
గతంలో ఉన్న సిద్దిపేట పార్లమెంట్ స్థానం, నియోజకవర్గాల పునర్విభజనలో రద్దవడంతో... అందులో కొన్ని అసెంబ్లీ స్థానాలు మెదక్ పార్లమెంట్ స్థానంలో కలిశాయి. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, దుబ్బాక, గజ్వెల్, సిద్దిపేట సహా మొత్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో గజ్వెల్, సిద్దిపేట నియోజకవర్గాలు వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్రావు నేతృత్వంలో టీఆర్ఎస్కు కంచుకోటగా మారాయి. దీంతో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మెదక్ నియోజకవర్గాన్ని.. గులాబీ పార్టీ లాగేసుకుందని చెప్పొచ్చు.
టీఆర్ఎస్ కంచుకోటగా మెదక్
అంతకు ముందు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మెదక్ స్థానం.. 2004 నుంచి టీఆర్ఎస్ పార్టీ సొంతమవుతూ వస్తోంది. 2004లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఆలె నరేంద్ర.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రారెడ్డిపై 1,24,766 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయశాంతి బరిలో నిలిచి సమీప కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్పై 6,077 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అటు మెదక్ లోక్సభ స్థానానికి, ఇటు గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. పార్లమెంట్ స్థానంలో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 3,97,029 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గజ్వెల్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిపై దాదాపు 17వేల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన సీఎం పదవిని అధిరోహించి.. మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం మెదక్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డిపై 3,61,277 ఓట్లతో విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగోసారి మెదక్ లోక్సభ స్థానం టీఆర్ఎస్ ఖాతాలో పడింది.
మహిళా ఓటర్లే ఎక్కువ
మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తంగా 13, 89, 721 మంది ఓటర్లుగా ఉండగా, అందులో 7, 00, 849 మహిళలు ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 6, 88, 872గా ఉంది. ఈ లెక్కన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.
మెదక్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపొందిన అభ్యర్థులు:
1952-57 ఎన్.ఎం.జయసూర్య , పీపుల్స్ డెమక్రాటిక్ ఫ్రంట్
1957-62 పి.హనుమంత రావు, కాంగ్రెస్ పార్టీ
1962-67 పి.హనుమంత రావు, కాంగ్రెస్ పార్టీ
1967-71 సంగం లక్ష్మీబాయి, కాంగ్రెస్ పార్టీ
1971-77 మల్లికార్జున్, తెలంగాణా ప్రజా సమితి
1977-80 మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ
1980-84 ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ
1984-89 పి.మాణిక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ
1989-91 ఎం.బాగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ
1991-96 ఎం.బాగారెడ్డి , కాంగ్రెస్ పార్టీ
1996-98 ఎం.బాగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ
1998-99 ఎం.బాగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ
1999-04 ఆలె నరేంద్ర, బీజేపీ
2004-09 ఆలె నరేంద్ర, టీఆర్ఎస్
2009-14 విజయశాంతి, టీఆర్ఎస్
2014(resigned) కె.చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్
2014by election కె. ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Indira Gandhi, Medak, Parliament