ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హర్యానాలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘రామాయణం, మహాభారతాలను తిట్టేవారు ఆ మహా కల్తీ కూటమిలో ఉన్నారు. వారు పాకిస్తాన్ను ప్రేమిస్తారు. భారతదేశ నిర్మాణానికి బాటలు వేసిన వారిని విస్మరిస్తారు. భారత్ అభివృద్ది చెందితే ఈ ఘటన పాకిస్తాన్కు ఇస్తారు.’ అని అన్నారు. వింగ్ కమాండర్ అభినందర్ వర్థమాన్ విషయంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. ‘పాకిస్తాన్ నుంచి మనల్ని మనం ఆత్మరక్షణ చేసుకునే సమయంలో ఓ ఆఫీసర్ దొరికాడు. అతను 48 గంటల్లో స్వదేశానికి వచ్చాడు. ఈ విషయంలో భారత దౌత్యాన్ని అభినందించాల్సింది పోయి.. ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ ప్రైజ్ ఇద్దామంటున్నారు.’ అని మోదీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రేమ అనే ముసుగు ధరించి, ద్వేషాన్ని ప్రచారం చేస్తోందని మోదీ ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతలు నన్ను చాలా తిడుతున్నారు. కొందరు హిట్లర్ అంటున్నారు. మరికొందరు ఇతరుల జీవితాలో ఆడుకునేవాడు అంటున్నారు. నన్నే కాదు. నా తల్లిని కూడా దూషించారు. నా తండ్రి ఎవరని అడిగారు. నేను ప్రధాని అయిన తర్వాత వారు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు. అదీ వాళ్లు చూపే ప్రేమ’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వాళ్లు ప్రేమ గురించి మాట్లాడతారని, కానీ, తనను ముక్కలు ముక్కలు చేయాలనుకుంటారు. అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని మోదీ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.