ఏపీలో తీవ్రంగా ఉన్న ఇసుక కొరతను తగ్గించే అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతుండటంతో పాటు దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన సీఎం జగన్... ఇసుక సరఫరాను పెంచాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడు ఇసుకను అధిక ధరలకు విక్రయించకుండా ప్రత్యేక చట్టం తేవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈలోగా దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ను సాధ్యమైనంత తొందరగా రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లు, అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.ఇసుక మాఫియా, అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని స్పష్టం చేశారు. ఇసుక ధరలను నిర్ణయించిన తరువాత కచ్చితంగా అదే ధరకు అమ్మాలని... అధిక ధరలను అమ్మే వారిని జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇసుక ధరలపై ఒక టోల్ ఫ్రీ నంబర్ను పెట్టాలని సీఎం జగన్ తెలిపారు. వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించాలని సీఎం జగన్ సూచించారు. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తామని అన్నారు. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తామని తెలిపారు.
ఇసుక కొరత తీర్చేందుకు సరిహద్దుల్లో నిఘాను పెంచాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక స్మగ్లింగ్ జరగకూడదని... ఇందుకోసం టెక్నాలజీని వాడుకోవాలని అన్నారు. చెక్పోస్టుల్లో ఇందుకోసం టీమ్లను పెంచాలని... మొబైల్ టీంలను పెంచుతామన్న అధికారులు సీఎంకు తెలిపారు. చెక్పోస్టుల వద్ద సిబ్బంది ఉండేందుకు వీలుగా కనీస సదుపాయాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రెయిడ్స్ చేయాలని.. కేసులు పెట్టాలని... తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా జైలుకు పంపాలని జగన్ అన్నారు. ఇది జరిగితే.. కచ్చితంగా పరిస్థితి అదుపులోకి వస్తుందని అన్నారు.
దీంతో పాటు ప్రస్తుతం ఇసుక లభ్యతపై అధికారుల నుంచి వివరాలు సీఎం జగన్ వివరాలు కోరారు. 275 రీచ్ల్లో 83 చోట్ల రీచ్లు పనిచేస్తున్నాయన్న అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పనిచేస్తున్న ఇసుక రీచ్ల సంఖ్య 61 రీచ్లనుంచి 83 రీచ్లకు పెరిగిందని వివరించారు. రోజుకు సరఫరా 41వేల మెట్రిక్ టన్నుల నుంచి 69 వేల మెట్రిక్ టన్నులు సరఫరా పెరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారంరోజుల్లో లక్ష మెట్రిక్ టన్నులకు సరఫరా పెరుగుతుందని అన్నారు. వాతావరణం ఇలాగే సహకరిస్తే... 15–30 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
వాతావరణం సహకరించిన వెంటనే 275 రీచ్ల్లో ఇసుక వెలికితీత ప్రారంభిస్తామని అన్నారు. రోజుకు 2–3 లక్షల టన్నుల వరకూ ఇసుకను సరఫరా చేయగలుగుతామని తెలిపారు. 275 రీచ్ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. 275 రీచ్ల్లో ఏం జరుగుతుందనే దానిపై మనం చూడగలగాలని అన్నారు. ఇసుక తవ్వకాలు నిలిచిపోతే ఎందుకు నిలిచిపోయాయో మనం తెలుసుకునే అవకాశం కలగాలని అన్నారు. మొత్తం 275 చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, మనం లైవ్లో చూడగలగాలని అధికారులను ఆదేశించారు.
మైనింగ్ అధికారులు, స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు కంట్రోల్ రూంద్వారా చూడగలగాలని తెలిపారు. రాత్రి పూట కూడా పనిచేయగలిగే సీసీ కెమెరాలు పెట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వరద నీరు తగ్గగానే అన్ని రీచ్లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలని సీఎం జగన్ అన్నారు. ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కిలోమీటర్కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతి ఇవ్వాలని సూచించారు.
ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలన్నారు. అవసరమైతే ఇంకా స్టాక్ పాయింట్లు పెంచాలని తెలిపారు. ఇసుక విషయంలో ఎవ్వరూ వేలెత్తిచూపకుండా ఇసుక సరఫరా కావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే రీచ్ల వద్ద ఈ నెలాఖరు నాటికి కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.