ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మహిళల జీవితాలను మెరుగుపరాచాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) అన్నారు. అసెంబ్లీలో (AP Assembly) మహిళా సాధికారతపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి నెలా 98శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారికి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా ఆర్ధికసాయం చేస్తున్నామన్నారు. ఈ పథకాల కింద రెండు విడతల్లో రూ.8,944 కోట్లు ఇచ్చామన్నారు. మహిళలను వ్యాపారస్తులుగా మార్చేందుకు పెద్దపెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షా మూడు వేలమంది మహిళలు రిటైల్ షాప్స్ ఏర్పాటు చేశారన్నారు.
వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా కొత్తగా 17వేల కాలనీలు నిర్మిస్తున్నామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీదే ఇచ్చామన్నారు. దీని ద్వారా కోటీ 25 లక్షల మందికి లబ్ధిచేకూర్చినట్లు తెలిపారు. ఈ కాలనీల్లో సౌకర్యాల కల్పన పూర్తైతే ప్రతి మహిళ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఆస్తులుంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల చేతుల్లో రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల కోట్లు ఇచ్చామన్నారు. జగనన్న విద్యాదీవెన కింద 18 లక్షల 81 వేల మంది తల్లుల ఖాతాలో రూ.5,573 కోట్లు జమచేశామన్నారు. జగనన్న వసతి దీవెన 15లక్షల మంది తల్లుల ఖాతాలో కింద రూ.2270 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.
దిశయాప్ ద్వారా మహిళల భద్రతకు పెద్దపీట వేశామన్నారు. ఈ యాప్ ద్వారా దాదాపు 6500 మంది పోలీసులు కాపడగలిగారన్నారు. లాభాపేక్ష ఉండే మద్యం షాపులను కూడా తీసేశామన్న జగన్.. 44వేల బెల్టు షాపులను పూర్తిగా తీసేశామన్నారు. గతంలో 4వేలకు పైగా ఉండే మద్యం షాపులను దాదాపు 2వేలకు తగ్గించామన్నారు. మద్యం వాడకాన్ని తగ్గించేందుకు షాక్ కొట్టేవిధంగా రేట్లు పెంచామని జగన్ తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎన్నికలు ఎక్కడ జరిగినా వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు. ఇటీవల 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే ఒక్క చోట మాత్రమే టీడీపీ గెలిచిందని.. 97శాతం వైసీపీకే ఓటు వేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీకి 50శాతం ఓట్లు వస్తే.. నగర పంచాయతీ ఎన్నికల్లో 55శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటికైనా టీడీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రతి సందర్భంలోనూ కోర్టుకు వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు. చంద్రబాబు కూడా సభలో ఉండి ఇవన్నీ విని ఉంటే బావుండేదని జగన్ అన్నారు. కనీసం సభలో లేకపోయినా కనీసం టీవీలో అయినా చూసీ జ్ఞానోదయం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy