ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. మంగళవారం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తో భేటీ అయిన సీఎం జగన్ పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, హైవేల విస్తరణపై చర్చించారు. అలాగే తీరప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రోడ్లను నిర్మించాలని జగన్.. గడ్కరీని కోరారు. అలాగే విశాఖపట్నం - భోగాపురం నేషనల్ హైవే, విజయవాడ ఈస్ట్ హైవే నిర్మాణంతో పాటు పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెల్లారు. అలాగే ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
గడ్కరీతో సమావేశం అనంతరం సీఎం జగన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి, స్కిల్ డెవలప్ మెంట్ అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశమయ్యారు. అరగంటకుపైగా జరిగిన సమావేశంలో ఏపీలో క్రీడా స్టేడియంల అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక సోమవారం సీఎం జగన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. సుమారు గంట పాటు ప్రధాని మోదీతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితులు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన హామీలను ప్రధాని ముందు పూస గుచ్చినట్టు జగన్ వివరించారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన పర్యవసనాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీశాయని ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు. విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కిందని గుర్తు చేశారు. 2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 15,454 రూపాయలు కాగా, ఏపీ తలసరి ఆదాయం 8,979 మాత్రమే అని అన్నారు.
ఇక పోలవరం అంశంపైనా ఎక్కువగా చర్చించినట్టు సమాచారం. 2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగిందన్నారు. ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో చెప్పిందని.. కానీ 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదన్నారు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోందన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.