తెలంగాణలో ఆరు కొత్త దేశీయ విమానాశ్రయాల ఏర్పాటు అనుమతివ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కేంద్రాన్ని కోరారు. శనివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిని కలిసి ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులకు సంబంధించి హర్దీప్తో చర్చించి.. అనంతరం లేఖను అందజేశారు సీఎం కేసీఆర్. ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్లను సిద్ధం చేసి.. 2018లోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు నివేదిక పంపించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. AAI ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సర్వే చేసినట్లు వెల్లడించారు తెలంగాణ సీఎం.
కొత్త ఎయిర్పోర్టులు ఎక్కడెక్కడంటే..
1. పెద్దపల్లి జిల్లాలోని బసంత్నగర్
2. వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్
3. ఆదిలాబాద్ జిల్లా
4. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి
5. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర
6. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణలో మొత్తం 6 చోట్ల దేశీయ విమానాశ్రయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. AAI నిర్వహించిన అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేస్ సర్వే, సాయిల్ టెస్ట్, ఇతర పరిశీలన డ్రాఫ్ట్ రిపోర్టు తాజాగా వచ్చిందని లేఖలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్. నూతన ఎయిర్పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పౌర విమానయానమంత్రి హర్దీప్సింగ్ పురిని ఈ సందర్భంగా కోరారు. ఎయిర్పోర్టు సైట్లను ఖరారు చేయడంలో సింగిల్ విండో ప్రతిపాదికన అన్ని చట్టబద్దమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. నాన్ - షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ కార్యకలాపాల కోసం సొంత నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని లేఖలో స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
Published by:Shiva Kumar Addula
First published:December 12, 2020, 16:46 IST