తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) సాగుతోన్న తీరు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు హైబీపీ తెప్పిస్తున్నట్లుంది. గంటల గంటకూ అభ్యర్థుల జాబితా మారిపోతూ.. బీఫామ్ చేతికి ఇచ్చినట్లే ఇచ్చి వేరొకరికి అవకాశం కల్పించడం.. ఆఖరి గంటలో కూడా అభ్యర్థి మారిపోవడం లాంటి దృశ్యాలు మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాం. నాటి డ్రామాకు ఏ మాత్రం తక్కువ కాకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ సైతం నాటకీయంగా సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ పర్యటనకు బయలుదేరే ముందే 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరు చేసి, కొందరికి బీఫారాలు కూడా ఇచ్చేశారు. సోమవారం నాడే పలవురు అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. నామినేషన్ల ప్రక్రియకు మంగళవారం చివరి రోజు కావడంతో సీఎం కేసీఆర్ సడెన్ గా జాబితాలో మార్పులు చేశారు. తన కూతురు కల్వకుంట్ల కవితను మళ్లీ నిజామాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్సీగా బరిలోకి నిలపాలని సీఎం నిర్ణయించుకున్నారు..
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు చివరిరోజైన మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కవిత నామినేషన్ వేయనున్నారు. తల్లి శోభను ఆస్పత్రిలో చేర్పించేందుకు కవిత ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నిజానికి టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం వెలువరించిన జాబితాలో నిజామాబాద్ ఎమ్మెల్సీ టికెట్ ఆకుల లలితకు దక్కినట్లు పేర్కొన్నారు. కానీ సోమవారం నాటి తాజా అప్ డేట్, దాదాపు అధికారికంగా వెల్లడైన సమాచారం ప్రకారం మాత్రం లలితను పక్కన పెట్టేసి(మొన్నటిదాకా ఆమె ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పనిచేశారు) కవితనే మరోసారి బరిలో దింపుతున్నారు.
అనధికారికంగా వెల్లడైన జాబితాలో కల్వకుంట్ల కవిత పేరు కానరాకపోయేసరికి ఆమెను రాజ్యసభ పంపాలని సీఎం నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా సిట్టింగ్ ఎంపీ బండ ప్రకాశ్ ను రంగంలోకి దించారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ సామాజికవర్గం(ముదిరాజ్)కు చెందిన బండ ప్రకాశ్ ను తెలంగాణ కేబినెట్ లోకి కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఆకుల లలిత పేరు బయటికొచ్చిన నేపథ్యంలో.. కవిత మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, బంబ ప్రకాశ్ ఖాళీ చేసిన రాజ్యసభ సీటును కవితకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ వాటన్నిటిని పక్కకు నెడుతూ కవిత మళ్లీ ఎమ్మెల్సీగానే బరిలోకి దిగుతున్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడంతో అనర్హత వేటుపడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి ఆమెకు అవకాశం దక్కింది మిగతా జిల్లాల అభ్యర్థుల వివరాలివి..
స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీలు భర్తీ కావాల్సి ఉంది. ఈనెల 23తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. కవిత కాకుండా ఇతర జిల్లాల్లో, మహబూబ్నగర్- సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఖమ్మం- తాత మధు, ఆదిలాబాద్- దండే విఠల్, రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డి, వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నల్గొండ- ఎంసీ కోటిరెడ్డి, మెదక్- డాక్టర్ యాదవరెడ్డి, కరీంనగర్- ఎల్.రమణ, భాను ప్రసాద్రావులకు అవకాశం దక్కింది. వీరిలో కొందరు సోమవారమే నామినేషన్లు కూడా వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, Mlc elections, Nizamabad, Trs