చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హ్యాట్రిక్ కొట్టగలరా? దీనికి సమాధానం తెలిసేది మే 23నే. అయితే, ఆయన హ్యాట్రిక్ కొట్టడానికి, చంద్రబాబుకు లింక్ ఏంటి అనుకుంటున్నారా?. అయితే, ఈ స్టోరీ చదివితే అర్థం అవుతుంది. గతంలో రెండుసార్లు చిత్తూరు నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసిన శివప్రసాద్ గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి తిప్పేస్వామి మీద కేవలం 11వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఆ తర్వాత 2014లో వైసీపీ అభ్యర్థి సామాన్య కిరణ్ మీద 44వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ రెండుసార్లూ చంద్రబాబునాయుడు వల్లే గట్టెక్కారని రాజకీయ పండితులు చెబుతారు. 2009లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు 46వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు అసెంబ్లీకి చంద్రబాబుకు వేసిన ఓటర్లు పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి మనసు మార్చుకున్నారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్కు భారీగా ఓట్లు పోల్ అయ్యాయి. కుప్పంలో టీడీపీకి పడిన ఓట్లు శివప్రసాద్ను ఎంపీగా గెలిపించాయనుకోవచ్చు.
2014లో కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 47వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. శివప్రసాద్ కూడా దాదాపు 44వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుప్పంలో అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటికీ ఓటర్లు పట్టం కట్టడంతో శివప్రసాద్ రెండోసారి పార్లమెంట్ మెట్లు ఎక్కడానికి వీలు కుదిరింది. అయితే, గతంలో చంద్రబాబుతో అభిప్రాయబేధాలు వచ్చినసందర్భంగా శివప్రసాద్ ఈ లెక్కలను తప్పుపట్టారు. తనకు మిగిలిన నియోజకవర్గాల్లోనూ మెజారిటీ బాగానే వచ్చిందని చెప్పారు.
2019లో శివప్రసాద్ మూడోసారి పార్లమెంట్ బరిలో దిగారు. ఈసారి వైసీపీ అభ్యర్థి ఎన్.రెడ్డప్పతో శివప్రసాద్ తలపడ్డారు. ఆయన హ్యాట్రిక్ కొడతారా? లేదా? అనేది మే 23న తేలుతుంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శివప్రసాద్ విచిత్ర వేషధారణలతో నిరసనలు తెలిపారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయనేది ఓ వాదన. ముచ్చటగా మూడోసారి కూడా తనకు చాన్స్ దక్కుతుందని శిప్రసాద్ ధీమాతో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Chittoor S01p25, Lok Sabha Election 2019, Mp sivaprasad, Tdp