ఏపీలో బంపర్ మెజార్టీతో విక్టరీ సాధించిన జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే 30న విజయవాడలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 10.30కు గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న జగన్ క్యాంప్ ఆఫీస్లో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం (YCLP) జరిగింది. ఈ సమావేశంలో జగన్ను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. తర్వాత మధ్యాహ్నం జగన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్కు వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవబోతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాజకీయంగా కీలకమైన భేటీగా భావిస్తున్న జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య భేటీ జరగబోతోంది.
రాజ్భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లి జగన్... సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్తో సమావేశమవుతారు. ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ను ఆహ్వానిస్తారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలను కేసీఆర్కు వివరించినట్లు సమాచారం. అటు ఆదివారం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేసీఆర్తో ఏం చర్చిస్తారు : కేంద్రంలో బీజేపీకి మెజార్టీ సీట్లు రాకపోయి ఉంటే, జగన్, కేసీఆర్ మధ్య రాజకీయపరమైన అంశాలపై లోతైన చర్చ జరిగేదని అనుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండటం వల్ల ఆ అంశాలు కాకుండా... రెండు రాష్ట్రాల మధ్య సహకారం, సమస్యలపై ఒకరికొకరు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగాలని, అందుకు కేసీఆర్ పూర్తి సహకారం అందించాలని జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.