(సయ్యద్ అహ్మద్, న్యూస్18 కరస్పాండెంట్, అమరావతి)
కృష్ణా జిల్లా సీఎంగా పిలుచుకునే ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఈసారి ఎన్నికల్లో ఎదురీత తప్పేలా లేదు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకమైన దేవినేని కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమామహేశ్వరావు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం మైలవరంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన నియోజకవర్గం మార్పు తప్పదనే ప్రచారం సాగుతోంది.
గతంలో 1999లో కృష్ణాజిల్లా నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమ... 2004లో అదే సీటు నుంచి విజయం సాధించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి విజయం సాధించిన ఉమామహేశ్వరావుకు ఈసారి పరిస్ధితులు అనుకూలంగా కనిపించడం లేదు. పదేళ్లుగా మైలవరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా... అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండటం, ఐదేళ్లుగా మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి చెప్పుకోదగిన స్ధాయిలో నిధులు తీసుకురాలేలేదనే విమర్శలు ఉన్నాయి.
మరోవైపు మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ తరఫున మైలవరం నియోజకవర్గ బరిలో ఉండటం దేవినేని ఉమకు ఇబ్బందిగా మారింది. దేవినేని ఉమతో పోలిస్తే అంగబలం, అర్ధబలంలో దీటుగా కనిపిస్తున్న కృష్ణప్రసాద్ స్వతహాగా వ్యాపారవేత్త అయినా... నియోజకవర్గంలో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, రెండేళ్లుగా వైసీపీ తరఫున అభ్యర్ధిగా ప్రచారం పొందడం కలిసివస్తోంది. దీంతో వసంత కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు ఉమ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంలో వసంత అనుచరులపై వరుస కేసులతో విమర్శలు వెల్లువెత్తడం, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అనుకూలంగా లేవన్న నిఘా వర్గాల సమాచారంతో ఉమ అప్రమత్తమయ్యారు. అటు టీడీపీ అధిష్టానం కూడా దేవినేని ఉమను మైలవరానికి బదులుగా నూజివీడు లేదా మరో నియోజకవర్గానికి మార్చడం ఖాయమని ప్రచారం సాగుతోంది. కృష్ణాజిల్లాలో కీలకమైన మంత్రి నియోజకవర్గం మార్చాల్సి వస్తే ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నోటిఫికేషన్ వచ్చాక ఉమ నియోజకవర్గం మార్పుపై స్పష్టత ఇవ్వాలని ఆలోచిస్తోంది.
ఇవి కూడా చదవండి
డాక్టర్ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన నర్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Krishna District, Tdp