ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరం తారస్థాయికి చేరుకుంది. కేంద్రం పేరెత్తితే ఏపీ సీఎం చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో.. బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రసంగించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఏపీ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. రాజకీయాల కోసం బీజేపీ పనిచేయదని, ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో లేనివి కూడా ఏపీకి చేశామని.. అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు.. ఎవరికోసం నిధులు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి సొమ్ములు ఎవరికి ఇస్తున్నారని.. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఏపీకి ఎన్ని ఇచ్చారో లెక్క చూసుకోవాలని సూచించారు. వినే వాళ్లుంటే ఎన్నైనా చెబుతారని, చెవిలో పువ్వులు పెడతారని బీజేపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదన్నారు.
ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతర తెలపగా.. మరోసారి తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు చంద్రబాబు. బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఉంటూ కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’’ మీ అభ్యంతరం ఎవడిక్కావాలి? కొత్త రాష్ట్రం ఏర్పడితే సాయం చేయాల్సింది పోయి సిగ్గు వదిలి పెడుతూ మాట్టాడుతున్నారు. మీరు మమ్మల్ని ఏం చేస్తారు? జైల్లో పెడతారా? ఊరుకుంటున్నాం కదా అని తమాషా చేస్తున్నారా? రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం. బీజేపీ నేతలను తిరగనివ్వం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు ఉగ్రరూపం దాల్చడంతో.. అసెంబ్లీలో గంభీరమైన వాతావరణం ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Assembly, Bjp, Bjp-tdp, Chandrababu naidu