AP ASSEMBLY ELECTION RESULTS 2019 LAGADAPATI RAJAGOPAL SURVEY FAILED AGAIN THIS TIME ON ANDHRA PRADESH ASSEMBLY ELECTIONS NK
లగడపాటి సర్వే సన్యాసమేనా... RG ఫ్లాష్ టీమ్ ఫసక్...
లగడపాటి రాజగోపాల్ (File)
AP Assembly Election Results 2019 : లగడపాటిపై గుర్రుగా ఉన్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. రెండుసార్లు తన సర్వే తప్పైతే... ఇక తాను గోడలకే సర్వేలు చెప్పుకోవాలన్న లగడపాటి ఇప్పుడు ఏం చేస్తారు ?
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే వరుసగా రెండోసారి అట్టర్ ఫ్లాపైంది. ఇదివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమికి అనుకూలంగా సర్వే ఇచ్చి... అప్రతిష్టపాలైన లగడపాటి... మరోసారి తప్పులో కాలేశారు. అసలేమాత్రం పోలిక లేని సర్వే ఫలితాలు ఇచ్చిన లగడపాటి... టీడీపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనీ, మహిళల ఓట్లు ఆ పార్టీకే పడ్డాయనీ చెప్పారు. 90 నుంచీ 110 స్థానాలు టీడీపీకి వస్తాయని గొప్పగా చెప్పారు. తన సర్వేను నమ్మాల్సిన పనిలేదంటూనే.... అత్యంత లోతుగా సర్వే చేశాననీ, ఇది తనకు జీవన్మరణ పోరాటం అనీ, కచ్చితంగా సరైన ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత, భారం తనపై ఉందనీ... ఇంకా చాలా చెప్పారు. కట్ చేస్తే... ఆయన ఇచ్చిన సర్వేకి పూర్తి విరుద్ధంగా... ఇంకా చెప్పాలంటే... అసలేమాత్రం పోల్చుకోవడానికి కూడా వీల్లేని ఫలితాలు వెల్లడయ్యాయి.
ఇక గోడలకే చెప్పుకోవాలి :వరుసగా తన సర్వే రెండుసార్లు తప్పైతే... ఇక తన సర్వేల ఫలితాలు తెలుసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరనీ, అందువల్ల ఇకపై తాను గోడలకే సర్వేల ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తుందని లగడపాటి స్వయంగా అన్నారు. రెండుసార్లు సర్వేలు తప్పైతే... రాజకీయాలకు మంగళం పాడినట్లే... సర్వేలకూ సన్యాసం ప్రకటిస్తారా అని ఓ ఛానెల్ ప్రశ్నించగా... అందుకు ఔననిగానీ, కాదని గానీ చెప్పని లగడపాటి... అలాంటి పరిస్థితి వస్తే, తన సర్వేలను గోడలకు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు ఆయన అన్నట్లుగానే రెండుసార్లు వరుసగా ఆయన సర్వేలు తప్పు అయ్యాయి కాబట్టి ఇక లగడపాటి దుకాణం సర్దుకోవడం బెటరంటున్నారు వైసీపీ అభిమానులు.
లగడపాటి సర్వేలు తప్పు అవ్వడానికి కారణాలు ఇవీ :లగడపాటి సంస్థ RG ఫ్లాష్ టీం సర్వే అంచనాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ప్రధానంగా కొన్ని కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1.సహజంగానే లగడపాటికి టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయనీ, అందువల్ల ఆయన టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇస్తున్నారని అంటున్నారు. 2.చంద్రగిరిలో టీడీపీని గెలిపించే కుట్రతోనే... ఎగ్జిట్ పోల్స్ కి ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి (మర్నాడే చంద్రగిరి రీపోలింగ్) ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కారని లగడపాటి చెప్పారన్న కోణం కనిపిస్తోందంటున్నారు కొందరు. 3. తాను ఐదేళ్లుగా టీవీయే చూడలేదని లగడపాటి చెప్పారు. అంటే అసలు రాజకీయాలపై, అలాంటి అంశాలపై లగడపాటికి ఎలాంటి ఆసక్తీ లేదు. అలాంటి వ్యక్తి సర్వేలను పక్కాగా ఎలా చేయించగలరు. అందుకే ఆయన సర్వే తప్పిందని విశ్లేషిస్తున్నారు.
అడ్డంగా బుక్కైన పందేల రాయుళ్లు :లగడపాటి సర్వేను నమ్మి చాలా మంది టీడీపీ గెలుస్తుందని పందేలు కాశారు. తీరా చూస్తే... టీడీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో... ఆ పార్టీ గెలుస్తుందని పందేలు కాసిన వాళ్లంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ కడితే... తమను టీడీపీ రోడ్డున పడేసిందని బోరుమంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.