ఆంధ్రప్రదేశ్లో మతసామరస్య కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 6పై ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ జీవోను చూస్తుంటే సెక్రటేరియట్లో అధికారులు తయారు చేసినట్టు లేదని, తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో తయారు చేసినట్టు ఉందన్నారు. అలాగే, ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన వైసీపీ కండువా కప్పుకోవాలని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో కొంతమంది అధికారులు పరిధిదాటి వ్యవహరిస్తున్నారు. బిజినెస్ రూల్స్ తెలుసుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జారీ చేసిన జీవోలో రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మత సామరస్య కమిటీలను నియమిస్తూ ఇచ్చిన జీవో నెం.6 ఒక ప్రభుత్వ అధికారి తయారు చేసినట్లుగా లేదు. ఇది సెక్రటేరియట్ లో తయారైందా? లేక తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు తయారుచేసిన జీవోనా? వైసీపీ నాయకులు తయారుచేసిన జీవోపై సీఎస్ కళ్లుమూసుకుని సంతకం పెట్టారా? లేక సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వైసీపీ కండువా కప్పుకున్నారా? 67 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి జోవో ఎన్నడైనా విడుదలైందా? ఏ జీవోలో అయినా ఇలాంటి భాష ఉపయోగించారా? మీరు అధికారులా? రాజకీయ నాయకులా? జగన్ రెడ్డి పాలనలో ఇప్పటిదాకా కొంతమంది పోలీసులే వైసీపీ కండువా కప్పుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ జీవోతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా ఉన్నతాధికారుల్లో కొందరు కూడా వైసీపీ కండువా వేసుకున్నట్లుగా ఉంది. తక్షణమే ఈ జోవోను ఉపసంహరించుకోవాలి. సరైన భాష ఉపయోగించి ఈ కమిటీలపై మరో జీవోను విడుదల చేయాలి.’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
గత తెలుగుదేశం పాలనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ‘పాలసీ పెరాలసిస్ వచ్చిన ప్రభుత్వంలోనే (టీడీపీ హాయంలో) ఆదిత్యనాథ్ దాస్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారా?’ అని ప్రశ్నించారు. ‘పాలసీ పెరాలసిస్ వచ్చింది గత ప్రభుత్వానికి కాదు.. వైసీపీ కండువా కప్పుకున్న మీలాంటి అధికారులకే పాలసీ పెరాలసిస్ వచ్చింది. మీ పాలసీ పెరాలసిస్ తో 19 నెలల్లో మొత్తం రాష్ట్రానికే పెరాలసిస్ వచ్చేలా చేయడం సిగ్గుచేటు. అధికారులు తమ పరిధి తెలుసుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో రాజకీయ విమర్శలు చేయడాన్ని మొట్టమొదటి సారిగా చూస్తున్నాం. ఇలాంటి ఎన్నో వింతలు జగన్ రెడ్డి పాలనలోనే జరుగుతున్నాయి. గతంలో జగన్ రెడ్డికి మేళ్లు చేకూర్చిన అధికారులకు ఏ గతి పట్టిందో మనం చూశాం. 2014-19 మధ్య పాలసీ పెరాలసిస్ జరిగిందని సీఎస్ ఏ విధంగా చెబుతారు? మీరు సీఎస్ గా పనిచేస్తున్నారా, లేక వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారా?’ అని అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. సీఎస్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 08, 2021, 18:42 IST