ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మొన్నటి వరకు పాలనను పట్టించుకోవడం లేదని ఆరోపణలే వినిపించాయి. కానీ ఇప్పుడు వైసీపీ సర్కార్ భారీగా అవినీతి పాల్పడుతోందని.. వందల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తోందని విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మంత్రిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దందా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో మంత్రి అనిల్ కుమార్పై ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు.. పెన్నా ఇసుక రీచ్ నుంచి సుమారు 100 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు. అవినీతి జరగలేదని నిరూపించుకోవాలి అంటే ఇసుక ర్యాంపుల దగ్గరకు వచ్చి మంత్రి మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి అవినీతిపై తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామంటున్నారు టీడీపీ నేతలు.
తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేశారు.. మంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి టిడిపి మినహా అన్ని పార్టీలు హాజరు కాగా.. రేపు భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పరివాహక ప్రాంతంలో అఖిలపక్షం సభ్యులు పర్యటించనున్నారు.. అయితే, అనుమతులు లేకుండా ఇసుకను తరలించిన మాట వాస్తవమేనని అఖిల పక్ష సభ్యుల చెబుతున్నారు.. కానీ, ఇసుక తరలింపు వ్యవహారంలో మంత్రి అనిల్ పాత్ర ఉందో లేదో మరో 24 గంటల్లో తేలే అవకాశం ఉందంటున్నారు..
ఇదీ చదవండి: నారా లోకేష్ దెబ్బకు దిగి వచ్చిన ఏపీ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో పోస్టుల హోరు
తనపై వచ్చిన ఆరోపణల గురించి మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రోజు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని.. వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.. చెత్త, చెదారమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ఇసుక రీచ్ వద్ద అనవసరంగా రాజకీయ సన్యాసం చేసుకుంటాను అన్నారు కొందరు అని సెటైర్లు వేశారు. రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇసుక వ్యవహారంలో నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరిన ఆయన.. దిగజారుడు తనంతో నేను బ్రతకలేనన్నారు.. రేపు ఉదయం అన్ని పార్టీలతో పాటు.. మా పార్టీ నుండి కూడా ఇద్దరి పంపిస్తాను అన్నారు.. పని చేస్తే ఆలోచనతో చేయాలి అని హితవుపలికారు.. నేను ఎప్పుడూ వ్యాపారుల దగ్గర డబ్బులు వసూళు చేయలేదన్నారు. ఆ మట్టితో ఎవరూ ఇల్లు కట్టుకోలేరన్నారు.. నేను వైఎస్ జగన్ శిష్యరికంలో రాజకీయం చేస్తున్నాను.. రాజకీయాలు చేస్తే మగాడిలా చేస్తాను అన్నారు. నేను అక్రమాలు చేస్తే నన్ను 2024 ఎన్నికల్లు ఓడిస్తారు అన్నారు మంత్రి అనిల్ కుమార్.. వైఎస్సార్ జెండా కోసం ఏమైనా చేస్తానన్న ఆయన.. ప్రతిపక్షం వారు నెల్లూరులో సంచులు తీసుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంచుల వెనుక ఎవరైనా ఉండొచ్చు… లోకేష్ కూడా ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.