ANDHRA PRADESH GOVERNOR APPROVED FOUR NOMINATED MLCS UDNER GOVERNOR QUOTA AFTER MEET CM JAGAN NGS
Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోదం... ఈ నలుగురి నేపథ్యం ఇదే..
గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలకు ఆమోదం
ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారానికి పుల్ స్టాప్ పడింది. ఇద్దరి పేర్లపై గర్నవర్ కి అభ్యంతరాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ తో భేటీ తరువాత ఆ నలుగురి పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇంతకీ వారి నలుగురినే సీఎం జగన్ ఎందుకు ఎంపిక చేశారు..
ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉత్కంఠ రేపిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. నాలుగు రోజుల పాటు రాజభవన్ నుంచి ఎమ్మల్సీల జాబితాకు ఆమోద ముద్ర రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ సతీసమేతంగా గవర్నర్ ను కలిశారు. ఆ వెంటనే ఎమ్మెల్సీల ఫైల్పై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేశారు. మోషేన్ రాజు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తుల పేర్లకు క్లియరెన్స్ వచ్చింది. సీఎం జగన్తో భేటీ తరువాతే ఆ ఫైల్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ముఖ్యంగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులు న్నట్లు గవర్నర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఫైల్ను గవర్నర్ పెండింగ్లో పెట్టారు. ఆయన ఆమోదం తెలుపుతారా? లేదా అనే అనుమానాలు ఉండేవి.. కానీ ఆయన ఆ నలుగురుకు ఓకే చెప్పారు. నామినేటెడ్ కోటాలో గవర్నర్ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట 4 పేర్లు ప్రతిపాదించింది. సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైళ్లను ఆయన అదేరోజు ఆమోదిస్తారు. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైల్ ఆలస్యం అవ్వడంపై రాజకీయ వర్గాల్లో హాటాపిక్ గా మారింది. కానీ ఆ వ్యవహారానికి గవర్నర్ తెరదించారు.
ఇటీవలి కాలంలో తన ద్వారా జరిగే నియామకాల్లో గవర్నర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి ఆ మధ్య రాష్ట్రప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపింది. అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్పై సర్కారు మొగ్గు చూపిందని ప్రచారం జరిగింది. కానీ గవర్నర్ ఆ ముగ్గురి సర్వీసుకు సంబంధించిన వార్షిక కాన్ఫిడెన్షియల్ రికార్డులు తెప్పించుకుని పరిశీలించారు. శామ్యూల్తో పాటు మరొకరి విషయంలో కొన్ని వివాదాలు ఉన్నట్లు గుర్తించి.. చివరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరును ఓకే చేశారు. ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలోనూ తన అభ్యంతరాలను తెరపైకితెచ్చారు. ఆయన మనోగతం తెలియడంతో ముఖ్యమంత్రి గవర్నర్ను కలవాలని నిర్ణయించారు.
సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్తో సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు పేర్లను సీఎం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాకింద ఈ నలుగురు నియామకానికి గవర్నర్ అధికారికంగా ఆమోదముద్రవేశారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన టిడి జనార్దన్, బీద రవిచంద్ర, గౌవిగారి శ్రీనివాస్, పి.శమంతకమణికి జూన్ 11తో పదవీ కాలం ముగిసింది. దీంతో ఆ నలుగురి స్థానంలో వీరు ఎంపిక అయ్యారు. మరో ఒకటి రెండు రోజుల్లో వీరి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.
ఈ నలుగరి ఎంపిక విషయంలోనూ సీఎం జగన్ చాలా ఆచూతూచి నిర్ణయం తీసుకున్నారు. సామాజికి, ప్రాంతీయ సమస్యలు రాకుండా జాగ్రత్త పడ్డారు. పని చేసే వారికే పదవులు అనే సంకేతాలు ఇవ్వగలిగారు. ఇందులో మోషేన్ రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన నేత కాగా, తోట త్రిమూర్తులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ నుండి వైసీపీలో చేరిన కాపు వర్గానికి చెందిన నేత, ఇక రాయలసీమ నుండి బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్ పేర్లను సామజిక వర్గాల సమతుల్యతతో ఎంపిక చేసినట్లుగా కనిపిస్తుంది.
గతంలో ఎమ్మెల్సీ పదవిని చివరి నిమిషనంలో మోషేను రాజు కోల్పోయారు. దీంతో ఈ ధపా గవర్నర్ కోటాలో ఆయన పేరును సీఎం జగన్ సిఫారుసు చేశారు. అలాగే 2019 ఎమ్మెల్యే ఎన్నికల్లో అప్పిరెడ్డికి సీటు కేటాయించలేకపోవడంతో ఈ దఫా ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు జగన్. రమేశ్ యాదవ్ ప్రస్తుతం ప్రొద్దుటూరు పురపాలక సంస్థలో కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. గతంలో సామాజిక సమీకరణలో భాగంగా ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయిన రమేశ్ యాదవ్కు ఈసారి అవకాశం కల్పించారని చెబుతున్నారు. ఇక తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని చాలా రోజుల నుంచే ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచి వచ్చినా.. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.