ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం. సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరాం హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే సుప్రీం తీర్పుపై న్యాయసలహా తీసుకున్నట్లు కూడా సమాచారం. తీర్పును పరిశీలించిన తర్వాతే సుప్రీం ఆదేశాలకనుగుణంగా ముందుకెళ్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
తమకు న్యాయవ్యవస్థపై, సుప్రీం కోర్టుపై నమ్మకముందన్న సీఎం జగన్.., ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయబోతున్నట్లు స్పష్టమైంది. ఐతే ఎన్నికలకు సహకరించాలని ప్రకటించిన ప్రభుత్వం.., నిమ్మగడ్డపై పోరు మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేయడం గమనార్హం. ఎన్నికలకు వెళ్తూనే., నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి కన్నాబాబు అన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మేం రెడీ: సజ్జల
పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాజకీయ పార్టీ సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్న సజ్జల.. పంచాయతీ ఎన్నికల్లో దూకుడుగా వెళ్తామని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి ఉన్నందునే ఎస్ఈసీ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించి కోర్టుకు వెళ్లామన్నారు. ప్రజలు ఎవరివైపు ఉన్నారనేది ఎన్నికల్లో తేల్చుకుంటామన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సజ్జల తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రతిపక్షనేత చంద్రబాబు ఏదో సాధించినట్లు ఫీలవుతున్నారని.., అసలు విజేతలెవరనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఇక్కడ తమకు ఎలాంటి ఈగో సమస్యలు లేవని సజ్జల స్పష్టం చేశారు.
Published by:Purna Chandra
First published:January 25, 2021, 19:29 IST