ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామి స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ రోజు ఆయన చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకోగానే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వామి స్వరూపానందకు కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వరూపానంద.. సీఎంను ముద్దాడి కౌగిలించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో 7గురు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసులు పహారా నిర్వహించారు. శారదా పీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. తొలిసారి సీఎం హోదాలో జగన్ వైజాగ్కు రావడంతో ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, శారదా పీఠం నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.
కాగా, పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Visakhapatnam S01p04, Ys jagan