ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలి (AP Legislative Council) రద్దు చేస్తూ గతంలో అసెంబ్లీ చేసిన తీర్మాన్నాన్ని ఏపీ అసెంబ్లీ (AP Assembly) వెనక్కి తీసుకుంది. మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకునే తీర్మానాన్ని శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. 2019లో ప్రజల మేలు కోసం కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు మండలి అడ్డుపడిందని బుగ్గన అన్నారు. కొన్ని చట్టాలు చేసినప్పుడు, సవరణలు చేయవలసి వచ్చినప్పుడు మండలి సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఐతే ప్రభుత్వం చేసిన చట్టాలకు జవాబుదారీగా ఉండాల్సింది అసెంబ్లీలోనని ఆయన అన్నారు. 2020 జనవరిలో శాసనమండలి అవసరం లేదని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మండలిని రద్దు చేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో అసలు ఏర్పాటే చేయలేదని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. కొన్ని కీలక అంశాల్లో సందిగ్ధతకు కారణమవుతున్నందున రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త సభ్యులు మండలిలోకి వచ్చినట్లు తెలిపారు. కొత్త సభ్యుల రాక వల్ల శాసనమండలి ఇకపై అసెంబ్లీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందనే భావనతో గతంలో రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి బుగ్గన సభకు తెలిపారు.
ఓ వైపు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో వెనక్కి తీసుకోగా.. మరోవైపు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలు మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP) తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి, ఇసాక్ బాషా, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ప్రమాణాలు చేశారు. ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కొత్త ఎమ్మెల్సీల చేత ప్రమాణాలు చేయించారు. కొత్త సభ్యుల రాకతో మండలిలో అధికార వైసీపీ బలం 21కి పెరిగింది. అటు ఏపీ అసెంబ్లీలో (AP Assembly)నూ మండలిపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏపీ అసెంబ్లీలో 151 మందితో తిరుగులేని బలమున్న వైసీపీకి మొన్నటిదాకా మండలిలో చిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. పాత టీడీపీ సభ్యుల గడువు ముగియడంతో స్వల్ప వ్యవధిలోనే 14 మంది కొత్త ఎమ్మెల్సీలు సభలోకి ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణాలు చేశారు. ఈ నెలాఖరులోగా మరో 11 మంది ఎమ్మెల్సీలు.. స్థానిక సంస్థల కోటా నుంచి, అదికూడా వైసీపీ నుంచే సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయా జిల్లాల నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఇప్పటికే నామినేషన్లు వేయడం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్సీలను కలుపుకొంటే, ఈ నెలాఖరులోగా మండలిలో వైసీపీ బలం 32కు పెరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.