ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. దేశంలో ప్రధాని మోదీ తర్వాత నెంబర్ 2 అయిన అమిత్ షాను వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో వారి మధ్య చర్చ జరిగింది. జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీయేలోకి రావాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా జగన్ కోరారు. దీనిపై చర్చిద్దామని అమిత్ షా చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ వైసీపీ ఎన్డీయేలో చేరితే.. ఆ పార్టీకి రెండు మంత్రిపదవులు కూడా ఇస్తామని అమిత్ షా ప్రతిపాదించారట. పౌర విమానయాన శాఖతో పాటు మరో సహాయమంత్రి పదవిని కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని జగన్ మోహన్ రెడ్డి అమిత్ షాకు చెప్పినట్టు తెలిసింది.
ఇటీవల వచ్చిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు వచ్చాయి. ఎన్డీయేకు పూర్తిస్థాయి మెజారిటీ కూడా ఉంది. ఎన్డీయేకు 353 మంది సభ్యుల బలం ఉంది. ఒకవేళ వైసీపీ కూడా ఎన్డీయేలో చేరితే ఆ సంఖ్యాబలం 375కు చేరుతుంది. అప్పుడు లోక్సభలో ఎన్డీయే బలం మూడింట రెండు వంతులకు పెరుగుతుంది. 2014లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కూడా కేంద్రంలో పౌర విమానయాన శాఖతో పాటు మరో కేంద్ర సహాయమంత్రి పదవిని బీజేపీ ఇచ్చింది. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఇద్దరూ కేంద్రంలో మంత్రిపదవులు పొందారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పుడు ఆ రెండు మంత్రిపదవులకు రాజీనామా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Bjp, Lok Sabha Election 2019, NDA, Ysrcp