స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించరాదంటూ కర్ణాటక బీజేపీ సర్కారు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. హిజాబ్ ధారణ తమ హక్కని ముస్లిం విద్యార్థులు, హిజాబ్ అంగీకారమైతే కాషాయ స్కార్ఫులకూ అనుమతివ్వాల్సిందేనని హిందూవాద విద్యార్థి సంఘాలు గొడవ పడుతున్నాయి. ఒక దశలో విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ప్రభుత్వం కర్ణాటక వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసేసింది. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం మధ్యప్రదేశ్, పుదుచ్చేరీలకూ పాకింది. అక్కడి స్కూళ్లలోనూ కర్ణాటక తరహా ఆంక్షలు తప్పవనే హెచ్చరికలొచ్చాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఉత్తరప్రదేశ్ లోనూ హిజాబ్ వివాదంపై నిప్పురాజుకుంటోంది. విపక్ష సమాజవ్ పార్టీ మహిళా నేత రుబియా ఖానం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ను తాకింది. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులకు హిజాబ్ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అలీగఢ్ ముస్లి యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ నేత రుబీనా ఖానం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిజాబ్ను తాకేందుకు ప్రయత్నించే చేతులను తెగనరుకుతాని రుబీనా హెచ్చరించారు. భారతదేశ అక్కచెల్లెళ్లు, కుమార్తెల ఆత్మగౌరవంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే వారు ఝాన్సీ రాణి, రజియా సుల్తానాల్లా మారి హిజాబ్ను తాకే వారి చేతులను తెగ నరకడానికి ఎంతో సమయం పట్టదని ఆమె అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పతనమని, ఇక్కడ ఎవరి మతాచారాలను వారు అనుసరిస్తారన్న రుబీనా.. కొందరు నుదట తిలకం దిద్దుకుంటే మరికొందరు తలపాగా ధరిస్తారని, ఇంకొందరు హిజాబ్ ధరిస్తారని, కొంగుతో ముఖాన్ని దాచుకోవడం (ఘూంఘట్), హిజాబ్ దేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వీటిని వివాదాస్పదం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నడిపించొచ్చని, కానీ మహిళల బలహీనులని మాత్రం భావించొద్దని రుబీనా హితవు పలికారు. ఎన్నికల వేళ ఎస్పీ మహిళా నేత వ్యాక్యలు దుమారం రేపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.