Political Fight on Maha Padayatra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అమరావతి రాజధానిగా (Capital Amaravathi) ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కు రాజకీయ రంగు పులుముకుంది. పాదయాత్ర ప్రకాశం జిల్లా (Prakasham District)కి చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకున్న పాదయాత్రలో అడుగుఅడుగునా టెన్షన్ వాతావరణం రేగింది. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతుకు చేయి విరిగిందని రైతులు అంటున్నారు.
రైతుల పాదయాత్రపై లాఠీ ఛార్జ్ ను మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులపై లాఠీ ఛార్జ్ చేయించారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విశేషమైన స్పందనను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు. జన సేన పార్టీ సైతం పోలీసుల చర్యను ఖండించింది. ఇది అప్రజాస్వామిక దాడి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
విపక్షాలు ప్రభుత్వమే కావాలని దాడి చేసిందంటూ ఆరోపిస్తుంటే.. పోలీసుల వర్షన్ వేరేలా ఉంది. అమరావతి పరిరక్షణ పేరుతో నిర్వహిస్తున్న రైతుల మహాపాదయాత్రలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో మహాపాదయాత్ర బృందానికి వ్యతిరేకదిశలో 250 నుంచి 300 మంది రాజకీయ నాయకులు దూసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా పాదయాత్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వ్యతిరేక దిశలో వచ్చారని తెలిపారు. రాజకీయ నేతలు పోలీసులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.
ఇదీ చదవండి: ఏపీలో వైసీపీని వెనక్కు నెట్టిన టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ దే నెంబర్ వన్ ప్లేస్..
ఏపీ ప్రభుత్వం మాత్రం అసలు రైతులపై లాఠీ చార్జ్ జరగలేదని.. ఇదంతా టీడీపీ కుట్ర అంటోంది. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దొంగ పాదయాత్రలు చేస్తున్నారని ఏపీ రవాణ, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రైతుల్ని మోసం చేసి వారి పేరుతోనే రియల్ ఎస్టేట్ యాత్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ యాత్రకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాదయాత్రలో వాస్తవమైన రైతులెవరూ లేరని.. ఉన్నవారంతా టీడీపీ నేతలేనని ఆరోపించారు.
కోర్టు, న్యాయమూర్తుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే. ఈ యాత్రకి చందాల పేరుతో చంద్రబాబు అండ్ కో తమ నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. యాత్ర రూట్ మ్యాప్ వెనుక కుట్ర దాగి ఉంది. ఘర్షణలకు దారితీసేలా ఉంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలను కవ్వించే విధంగా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబు తన ఆస్తుల కోసం అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకో ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కుట్రలకు పాల్పడుతున్నాడు. మా నాన్న దేవుడు అంటున్న లోకేశ్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాలి. ఆయనను చదువుకోడానికి అమెరికా పంపితే భూతులు, కుట్రలు నేర్చుకుని వచ్చాడు అని మంత్రి ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap minister perni nani, AP News, Chandrababu Naidu, TDP