వేసవి ప్రారంభంలోనే దేశంలోని అడవులు కార్చిర్చు బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒడిషాలోని సిమిలీపాల్ ఫారెస్ట్ రిజర్వ్లో వ్యాపించిన కార్చిర్చును అదుపు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. గత వారం ఇక్కడి అడవుల్లో మంటలు వ్యాపించాయి. అప్పటి నుంచి అడవి మొత్తానికి కార్చిచ్చు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సిమిలీపాల్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జీవ వైవిధ్యానికి నిలయమైన ఇలాంటి ప్రాంతాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అడవుల్లో మంటలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో సిమిలీపాల్ ఫారెస్ట్ రిజర్వ్ ఉంది. ఈ అడవులు మొత్తం 2,750 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. గత వారం అడవుల్లో మొదలైన మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 21 ఫారెస్ట్ రేంజ్లలో 8 రేంజ్లకు మంటలు విస్తరించాయి. ఇక్కడ ఎన్నో రకాల జీవులు ఆవాసముంటున్నాయి. అంతరించి పోతున్న జాతులను ఈ అడవుల్లో సంరక్షిస్తున్నారు. మంటల కారణంగా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ఆ ట్వీట్ తరువాతే కదలిక
రాష్ట్రంలోని మయూర్ భంజ్ రాజ కుటుంబానికి చెందిన యువరాణి అక్షిత భంజ్ దేవ్ సిమిలీపాల్ అగ్నిప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. ఆ తరువాతే ప్రభుత్వం కార్చిచ్చు నివారణపై దృష్టి సారించడం విశేషం. వారం రోజుల క్రితమే అడవుల్లో మంటలు వ్యాపించినా.. అధికారులు, యంత్రాంగం పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపించారు. ‘ఆసియాలో జీవావరణం ఎక్కువగా ఉన్న రెండో రిజర్వుడ్ ఫారెస్ట్ ఇది. గత వారం ఇక్కడి అడవుల్లో 50 కిలోల ఏనుగు దంతం లభించింది. ఇసుక, కలప మాఫియా అడవుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కార్చిచ్చు వ్యాపించింది. కానీ దీనిపై నేషనల్ మీడియా ఏమాత్రం దృష్టి సారించట్లేదు’ అని మార్చి 1న చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ఆ తరువాత కార్చిచ్చుపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జావడేకర్ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.
అదుపులోనే పరిస్థితులు
ప్రస్తుతం సిమిలీపాల్ అడవుల్లో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చామని ఒడిశా ఎడిషనల్ చీఫ్ సెక్రటరీ, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ మోనా శర్మ తెలిపారు. ఈ మంటల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కార్చిచ్చు నియంత్రణకు ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. అగ్నిప్రమాదాల గురించి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు కలెక్టర్లకు, ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశించారు. మంటలను ఆర్పేందుకు 250 మంది ఫారెస్ట్ గార్డులు, 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకు 40 ఫైర్ టెండర్లు, 240 బ్లోయర్ మిషన్లను వాడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ మంటల్లో కాలిపోయి, చనిపోయిన జీవజాతుల గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha